మన ఊరు-మన బడి పనులేవి?
ABN , First Publish Date - 2022-06-06T04:57:44+05:30 IST
మన ఊరు-మన బడి పనులేవి?
- విద్యా సంవత్సరం దగ్గర పడుతున్నా ప్రారంభం కాని పనులు
- మొదటి దశలో మండలానికి రెండు చొప్పున స్కూళ్ల ఎంపిక
- అంచనాలో పది శాతం నిధులు పాఠశాలల ఖాతాల్లో జమ
- ఆదరాబాదరాగా చేసే పనుల్లో నాణ్యతెంత?
- చేపట్టే పనులపై ప్రణాళిక లోపించిందంటున్న తల్లిదండ్రులు
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ఏటా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. మూడు నెలల కిందే కార్యక్రమాన్ని రూపొందించినా అమల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయమొచ్చినా ప్రతిపాదించిన ఒక్క స్కూలులోనూ చేయాల్సిన పనులు పూర్తి చేయలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం, శిథిల గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం, బాత్రూంలు, టాయ్లెట్లు పూర్తిస్థాయిలో కట్టి నీటి కనెక్షన్ ఇవ్వడం, తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్, విద్యార్థులకు, సిబ్బందికి కావాల్సిన ఫర్నిచర్ ఏర్పాటు తదితరాలన్నీ మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టాలి. ఇంకా ఎస్టిమేట్లు, ప్రతిపాదనల దశలోనే కార్యక్రమం ఉందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
తాండూరు, జూన్ 5: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చి దిద్దుతామని మార్చిలో జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో భా గంగా స్కూళ్లలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ‘మన ఊరు-మన బడి’ మొదటి దశలో నీటి వసతి తో కూడిన టాయిలెట్ల నిర్మాణం, స్కూలుకు విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, గ్రీన్చాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మూడు దశల్లో కలిసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తామంది. పనులు మాత్రం చేయడంలేదు.
- అంచనాలు, తీర్మానాలతోనే కాలం వెల్లదీత
మొదటి దశలో మండలానికి రెండు చొప్పున పాఠశాలలను ఎంపిక చేశారు. మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ‘మన ఊరు-మన బడి’లో తలపెట్టిన పనులు కొన్ని పాఠశాలల్లో ప్రారంభమే కాలే దు. మరికొన్నింటిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనుల తీర్మానాలే పంపలేదు. ఈ కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీలూ సభ్యులుగా ఉంటారు. స్కూళ్లలో ఏ పనులు చేపట్టాలనే విషయంపై పంచాయతీరాజ్ ఏఈ అంచనాలు వేసి డీఈ, ఈఈ ద్వారా కలెక్టర్ లాగిన్కు పనుల వివరాలు పంపాలి. అయితే తాండూరు డివిజన్లో ఇప్పటి వరకు పంపిన తీర్మానాల్లో కలెక్టర్ ఆమోదం సైతం పొందలేదు. ఇదిలా ఉంటే ప్రతిపాదిత పనులకు ఇంజినీరింగ్ విభాగం చేసిన అంచాలకు పది శాతం నిధులను ఆయా పాఠశాల ల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది. ఉదాహరణకు తా ండూరులోని మల్రెడ్డిపల్లి పాఠశాలలో సదుపాయాల క ల్పనకు రూ.20లక్షలు అంచనా వేయగా ఇవ్వగా రూ.2లక్ష లు ఖాతాలో జమ చేశారు. ఎస్ఎంసీలు ఖాతా నిధులను తిరిగి కలెక్టర్ తన ఖాతాలోకి జమ చేయించుకున్నారు. మ ండలానికి సరాసరి 40-45 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో పనులను నామినేషన్ విధానంలో చేపట్టేందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలోని 17 మందిలో మెజార్టీ మెంబర్లు తీర్మానించాల్సి ఉంటుంది.
- ముంచుకొచ్చిన విద్యా సంవత్సరం.. మొదలు కాని పనులు
మారుమూల గ్రామాలు, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మన ఊరు-మన బడికి ఎంపిక చేయలేదు. బడుల్లో బాత్రూంలు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. మన ఊరు-మన బడిలో వాటి స్థానంలో కొత్తవి నిర్మించా ల్సి ఉంది. వారం రోజుల్లో విద్యా సంవత్సరం మొదలవను న్న నేపథ్యంలో తలపెట్టిన పనులు ఎన్ని పూర్తి చేస్తారు.. ఒకవేళ అదరాబాదరాగా చేస్తే పనుల మన్నిక ఎంత ఉం టుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఏది ఏమైనా పథకం ప్రా రంభించి చాలా రోజులే అయినా ఎస్టిమేట్లు, తీర్మానాలు, స మావేశాలు అంటూ కాలం వెల్లదీయడంతోనే సరిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అంటున్నారు. ఒక పక్క పాఠశాలలు ప్రారంభం అవుతుంటే పనులెలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వేసవి సెలవుల్లోనే పనులు చేయాల్సిందని, దీనిపై ప్రణాళిక లోపించిందంటున్నారు.