పేదలకు ఇళ్లు... పెద్దలకు కోట్లు!

ABN , First Publish Date - 2020-06-06T09:22:58+05:30 IST

పేదలకు ఇళ్లు... పెద్దలకు కోట్లు! ఇది తాజా ‘స్కీమ్‌’. రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న దందా ఇది! సొంత భూములను అధిక ధరకు కొనేలా చేయడం, రైతుల నుంచి

పేదలకు ఇళ్లు... పెద్దలకు కోట్లు!

  • భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌
  • రంగంలోకి అధికార నేతలు.. ప్రభుత్వ సొమ్ము లూటీ
  • ‘ఇన్‌సైడ్‌’ సమాచారంతో ముందే కొని...
  • ఆపై సర్కారుకు అధిక ధరకు విక్రయం!
  • ఎక్కువ ధర ఇప్పిస్తామంటూ
  • రైతుల నుంచి భారీగా కమీషన్లు
  • చెప్పిన చోటే భూసేకరణ జరిగేలా
  • అధికారులపై నేతల ఒత్తిళ్లు
  • కృష్ణాలో ఒకే నేతకు రూ.50 కోట్లు
  • ‘తూర్పు’లో 190 ఎకరాలు కట్టబెట్టారు
  • బహిరంగ మార్కెట్‌కు రెట్టింపు ధర


వారంలోనే కోట్లు...

గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి అనుచరులు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసే ప్రాంతాన్ని ముందుగా తెలుసుకున్నారు.  అక్కడ ఎకరం రూ.45 లక్షల చొప్పున 10 ఎకరాలు కొనుగోలు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అదే భూమిని ఎకరం రూ.90 లక్షల చొప్పున ప్రభుత్వానికి విక్రయించారు. కేవలం వారం పది రోజుల్లోనే కోట్లు కొల్లగొట్టారు.


ఫ్లాటు సమర్పయామి!

కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన ఓ రైతు ప్రభుత్వానికి తన భూములు అప్పగించారు. ఆయనకు అందిన మొత్తంలో కోటి రూపాయలు కమీషన్‌గా ఇవ్వాలని స్థానిక నేత ఫిక్స్‌ చేశారు. అయితే... భూసేకరణ చట్టంతో పోల్చితే తమకు వచ్చింది తక్కువే అని, కమీషన్‌ ఇవ్వలేనని రైతు అడ్డం తిరిగాడు. అంతే...  వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి...  హైదరాబాద్‌లో ఆ రైతుకు ఉన్న సుమారు రూ.80 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంటు అధికార పార్టీ నేత బంధువుల పేరు మీదకు మారిపోయింది.


సొంత భూములకు ధరల సోకు

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఇళ్ల స్థలాల పేరుతో అధికారులు 248 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఎకరా రూ.20  లక్షలు పలుకుతుండగా...  రూ.45 లక్షల వెల కట్టారు. ఇందులో 190 ఎకరాల వరకు అధికార పార్టీ నేతలకు చెందినవే. ఈ భూములన్నీ గోదావరి వరదలో ముంపునకు గురయ్యేవే. ఈ విషయం తెలిసీ అక్కడే భూములు కొంటుండటం గమనార్హం. 


పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఫలానా చోట ప్రభుత్వం భూములు కొనే అవకాశముందని తెలుసుకుని... ముందుగానే అక్కడ తాము భూములు తక్కువ ధరకు కొనడం! ఆ భూములను అధిక ధరకు ప్రభుత్వానికి విక్రయించడం!... ఇది ‘ఇన్‌సైడ్‌’ ట్రేడింగ్‌.

అధికారులతో కుమ్మక్కయి, వారిపై ఒత్తిడి తెచ్చి... సొంత భూములను భారీ ధరకు కొనుగోలు చేయించడం!.. ఇది అధికార దుర్వినియోగం.

‘మీ భూములకు ఎక్కువ ధర ఇప్పిస్తాం. మాకు కమీషన్‌ ఇవ్వండి!’... ఇది ఫక్తు దళారీ దందా!

...ఇన్ని రకాల మాయలకు కేంద్రంగా మారింది ఒకే ఒక్క పథకం! అది... పేదలకు ఇంటి స్థలాల కోసం ప్రైవేటు భూములు కొనుగోలు చేయడం!


(విజయవాడ, కాకినాడ, గుంటూరు, అనంతపురం - ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్లు... పెద్దలకు కోట్లు! ఇది తాజా ‘స్కీమ్‌’. రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న దందా ఇది! సొంత భూములను అధిక ధరకు కొనేలా చేయడం, రైతుల నుంచి కమీషన్లు దండుకోవడం, ముందుగానే తక్కువ ధరకు భూములు కొని, అవే భూములను సర్కారుకు అధిక ధరకు అంటగట్టడం! ఇలా ఒక్కోచోట  ఒక్కోరకం దందా నడిచింది. స్థానిక నాయకులు కొందరు కోట్లలోనే దండుకున్నారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేత ఒకరు ఈ కమీషన్ల తంతును నడిపించారు. ఆయన ఒక్కరే సుమారు రూ.50 కోట్లు తన జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 488 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. వీటి ధర నిర్ణయించే విషయంలోనే గోల్‌మాల్‌ జరిగింది. వణుకూరు గ్రామంలో సేకరించిన భూమి విలువ బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఎకరా గరిష్ఠంగా రూ.60 లక్షల వరకు ఉంటుంది. కానీ... రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ ఎకరాకు రూ.75 లక్షలు నిర్ణయించారు. రైతులకు ఎక్కువ ధర లభిస్తే మంచిదే.


కానీ... అందులో రూ.6 లక్షలు కమీషన్‌ కింద నొక్కేయడమే అసలు ట్విస్టు! కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లు-వేల్పూరు సరిహద్దులో సుమారు 30 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఎకరం రూ.50-60 లక్షలు ఉంటుంది. కానీ, ఎకరా ధర రూ.72 లక్షలుగా నిర్ణయించారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరాకు రూ.10 లక్షలు కమీషన్‌గా కొట్టేసినట్లు తెలిసింది. ఇక ఉయ్యూరులో ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.6 నుంచి 15 లక్షల వరకు కమీషన్ల రూపంలో దండుకున్నారు. ఇలా... ఒక్క పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు రూ.50 కోట్లు కమీషన్‌ కొట్టేసినట్లు సమాచారం. ఇక... నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల పరిధిలోని నెక్కలంగొల్లగూడెం గ్రామంలోనూ భారీగా అవకతవకలు జరిగాయి. గ్రామానికి ఆనుకుని ఎకరం భూమి రూ.40 లక్షలకు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చినా... అధికారపక్ష ఒత్తిడికి తలొగ్గి ఊరికి దూరంగా చెరువు, శ్మశానం మధ్యన ఉన్న భూమిని రూ.55 లక్షలకు  కొనుగోలు చేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అధికారులు, స్థానిక నేతలు సొమ్ములు పంచుకున్నారు.


కమీషన్‌ కోసం దండోపాయం

కృష్ణా జిల్లా వణుకూరులో ఓ రైతు 13 ఎకరాలను భూసేకరణకు ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.10 కోట్లు వచ్చాయి. ‘మా కమీషన్‌ రూ.80 లక్షలు’ అని అధికార పార్టీ నేత డిమాండ్‌ చేశారు. అయితే... అదే రైతుకు, సదరు నేత బంధువుకూ మధ్య ఒక భూమి కొనుగోలు వ్యవహారం అసంపూర్తిగా మిగిలి ఉంది. దాన్ని సెటిల్‌ చేస్తే కమీషన్‌ డబ్బులు ఇస్తానని ఆ రైతు స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహించిన నేత దండోపాయానికి దిగారు. మరుసటి రోజే ఆ రైతు కుమారుడికి పోలీసు స్టేషన్‌ నుంచి పిలుపు వచ్చింది. ఎందుకు, ఏమిటీ అని చెప్పకుండా రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టారు. దీంతో రైతు, రైతు కొడుకుకు విషయం అర్థమైంది. ఆగమేఘాలపై రూ.60 లక్షలను అధికార పార్టీ నేతకు సమర్పించుకున్నారు. మిగిలిన మొత్తాన్ని కొద్ది రోజుల్లో ఇస్తామని వేడుకుని గడువు తీసుకుని వెనుదిరిగారు.


ఎకరాకు 3 లక్షలు...

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఎకరం రూ.22 లక్షలు కూడా విలువ చేయని భూములకు రూ.34 లక్షల వరకు చెల్లించారు. ఇక్కడ ఎన్నో భూములు ఉండగా, అధికార పార్టీ నేతలు సూచించిన భూములనే ఎంపిక చేశారు. అధికార పార్టీ నేతలు, కొందరు రెవెన్యూ సిబ్బంది కలిపి ధరలు పెంచి ప్రతిపాదనలు పంపారు. తీరా... పరిహారం రైతుల ఖాతాల్లో పడ్డాక ఎకరాకు రూ.3 లక్షలు కమీషన్‌ డిమాండ్‌ చేశారు.


అనేక రెట్లు... 

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కాటిగానికాలువ గ్రామ సమీపంలో కొండగుట్టల్లో ఉన్న 108 ఎకరాల భూమిని ఎకరా రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడ ఎకరం ధర రూ.5 లక్షలకు మించదని గ్రామ రైతులే చెబుతున్నారు.

ఉరవకొండ పట్టణంతోపాటు మండలంలో 14.79 ఎకరాలు కొనుగోలు చేశారు. మార్కెట్‌ ధర రూ.రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల దాకా మార్కెట్‌ ధర ఉండగా.. రూ.28 లక్షలు చెల్లించారు.

విడపనకల్లు మండలం హావళిగిలో ఆరున్నర ఎకరాలు కొన్నారు. రూ.3.5 లక్షల మార్కెట్‌ ధర ఉండగా ఎకరాకు రూ. 25 లక్షలు చెల్లించారు.


గుంటూరులో మరిన్ని రకాలుగా...

గుంటూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల పథకం... అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. డెల్టా ప్రాంతంలోని ఒక్క నియోజక వర్గంలోనే రూ.45 నుంచి రూ.50 కోట్ల వరకు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో  అధికార పార్టీ ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో భూ కొనుగోలు వ్యవహారం మొత్తం తానే నడిపించారు. తనకు, తన వాళ్లకు చెందిన 100 ఎకరాల భూమికి ఎక్కువ ధర వచ్చేలా అధికారులను ఒప్పించి భారీగా లాభపడ్డారు. పల్నాడు ప్రాంతంలో మరో నియోజకవర్గంలో భూ కొనుగోలు వ్యవహారం అడ్డగోలుగా జరిగింది. నివాసయోగ్యం కాని ప్రాంతమైనప్పటికీ కేవలం  వైసీపీ నేతల భూములు కావడంతో అధిక ధరలు చెల్లించి కొన్నారు. ఎందుకూ పనికిరాని, పైగా  శ్మశానానికి పక్కన ఉన్న భూములకు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారు. గ్రామానికి దూరంగా ఉండి నివసించేందుకు ఏమాత్రం పనికిరాని చోట ఎకరం రూ.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ భూమి ధర ఎకరం రూ.20 లక్షలు కూడా ఉండదు. వైసీపీకి చెందిన కొందరు చోటా నేతలు దళారుల అవతారమెత్తి సొమ్ములు దండుకుంటున్నారు. ‘మీ భూమికి ఎక్కువ ధర ఇప్పిస్తాం. మాకు కమీషన్‌ ఇవ్వండి’ అంటూ రైతులను మాయ చేస్తున్నారు. తమ ప్రమేయంలేకుండా అధిక ధర వచ్చినా... ‘మా వల్లే వచ్చింది’ అంటూ ఎకరానికి  2 నుండి 3 లక్షలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. 


‘తూర్పు’లో భూమాయ

తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు భూముల సేకరణ కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది. దీంతో... కొందరు అధికార పార్టీ నేతలు ‘పండగ’ చేసుకుంటున్నారు.  కొంతమంది రైతులు, డీ-పట్టాదారులతో ముందుగానే రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. తహసీల్దార్‌, ఆర్డీవోలను ఒప్పించి... ఇళ్ల స్థలాలకు తాము సూచించిన భూములనే సేకరించేలా నోటిఫికేషన్‌ ఇప్పిస్తున్నారు. తక్కువ ధర పలికే భూములకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. ఆ మేరకు రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేస్తున్నారు. అటు డీ-పట్టా భూములకు కూడా ఇతర జిరాయితీ భూముల తరహాలోనే రేట్లు కట్టి దండుకుంటున్నారు. కోటనందూరు మండలం భీమవరపు కోటలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ... రూ.కోటితో ప్రైవేటు భూమి కొనేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత అయితే కొందరు రైతులకు దక్కే అధిక పరిహారంలో 20శాతం తనకు వచ్చేలా ముందస్తు చెక్‌లు రాయించుకున్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-06T09:22:58+05:30 IST