3 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-08-07T10:07:23+05:30 IST

జిల్లాలో ఆగస్టు 15 నాటికి మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ..

3 లక్షల మందికి ఇళ్ల స్థలాలు



 మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 6 : జిల్లాలో ఆగస్టు 15 నాటికి మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ డా.జె.మాధవీలత తెలిపారు. గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ 4080 ఎకరాల భూములు కొనుగోలు చేస్తున్నామని, ఇందుకు రూ.1500 కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పటికే రైతులకు రూ.1390 కోట్లు అందజేశామన్నారు.  రైతులు ఇళ్ల స్థలాలు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే భూములపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఆ భూములకు బదులు ప్రత్యామ్నాయంగా మరికొన్ని భూములను సేకరిస్తున్నామన్నారు.  జిల్లా మచిలీపట్నం, కరగ్రహారంలో ఏర్పాటు చేసిన లే అవుట్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద లేఅవుట్‌ అన్నారు. 17 వేల మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.


ఇక్కడకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన అనంతరం ఇళ్ల నిర్మాణంతోపాటు రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌ సరఫరా, పార్కులు, పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఈ కర్షక్‌ విధానం చురుగ్గా సాగుతోందన్నారు. సచివాలయాల్లో రైతులకు రైస్‌కార్డులు అందించే కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు. రైస్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు పది రోజుల్లో అందిస్తామన్నారు. జిల్లాలో వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందిస్తున్నామన్నారు. కరోనాను అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టరేట్‌లో కొందరు ఉద్యోగులు కరోనా బారినపడ్డారని, వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టామని ఆమె చెప్పారు. 

Updated Date - 2020-08-07T10:07:23+05:30 IST