ఇళ్ల ధరలు మరింత ప్రియం
ABN , First Publish Date - 2022-05-25T09:13:55+05:30 IST
రియల్టీ మార్కెట్లో అప్ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జోరందుకున్నాయి.
హైదరాబాద్లో 9 శాతం జంప్
న్యూఢిల్లీ: రియల్టీ మార్కెట్లో అప్ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 11 శాతం వరకు పెరిగాయి. హౌసింగ్ ప్రైస్-ట్రాకర్ పేరుతో క్రెడాయ్-కోలియర్స్ సంస్థలు విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది.
హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ రూ.9,232: దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో హైదరాబాద్లో అత్యధిక సగటు ధర నమోదైంది. ఈ కాలంలో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస గృహాల్లో ఎస్ఎఫ్టీ సగటున రూ.9,232 పలికింది. గత ఏడాదితో పోలిస్తే ఇది తొమ్మిది శాతం ఎక్కువ. అత్యధికంగా 11 శాతం పెరిగిన ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నివాస గృహాల్లో ఎస్ఎఫ్టీ సగటు ధర రూ.7,363కు మించి లేదు. ఎనిమిది శాతం పెరుగుదలతో అహ్మదాబాద్ మూడో స్థానంలో, ఆరు శాతం పెరుగుదలతో కోల్కతా నాలుగో స్థానంలో నిలిచాయి. కాగా బెంగళూరు, చెన్నై, ముంబైల్లో ధరల పెరుగుదల ఒక శాతం మించలేదు.