గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత బోధన
ABN , First Publish Date - 2021-07-27T04:11:59+05:30 IST
గ్రామీణప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి వారికి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే కృషిచేయడం అభినందనీయమని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు
‘కిట్స్’కు హోంమంత్రి మేకతోటి కితాబు
వట్టిచెరుకూరు, జూలై 26: గ్రామీణప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి వారికి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే కృషిచేయడం అభినందనీయమని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సోమవారం వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడారు. క్యాంపస్ సెలక్షన్స్లో అత్యధిక మంది విద్యార్థినులు ఎంపికకావడం హర్షణీయమన్నారు. బాలికల రక్షణకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశయాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిక్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది డిఎక్స్సి, టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, స్లాప్ 6.3 తదితర కంపెనీల్లో తమ విద్యార్థులు 482మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అత్యధికంగా రూ.8లక్షల వార్షికవేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. అత్యున్నతమైన నాక్, ఎన్బీఏ గుర్తింపులతోపాటు అటానమస్ స్టేటస్తో విద్యార్థులకు అత్యత్తమ బోధన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి కోయి శేఖర్, డైరెక్టర్ డాక్టర్ కె.హరిబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మంత్రి సుచరిత సత్కరించారు.