ఇళ్లు, కుటుంబం, పొదుపునకు పెద్దపీట!
ABN , First Publish Date - 2021-02-25T06:56:25+05:30 IST
కొవిడ్ మహమ్మారి మూలంగా ప్రజల ప్రాధాన్యాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్టు తాజాగా గ్లోబల్ రిసెర్చ్ సంస్థ యూగావ్ సర్వేలో తేలింది.
యూగావ్ నివేదికలో వెల్లడి
ముంబై, ఫిబ్రవరి 24: కొవిడ్ మహమ్మారి మూలంగా ప్రజల ప్రాధాన్యాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్టు తాజాగా గ్లోబల్ రిసెర్చ్ సంస్థ యూగావ్ సర్వేలో తేలింది. గత నవంబరులో ఆన్లైన్లో 17 దేశాల్లో సర్వేను నిర్వహించి నివేదిక రూపొందించినట్లు యూగావ్ తెలిపింది. మొత్తం 19 వేలమంది సర్వేలో పాల్గొనగా.. భారత్ నుంచి వెయ్యిమంది పాల్గొన్నారు. ఆ నివేదిక ప్రకారం.. భారత్లో పట్టణాల్లోని ప్రజలు డబ్బును పొదుపు చేయడమే అత్యంత ఆర్థిక ప్రాధాన్యంగా భావిస్తున్నారు.
ప్రతి ఐదుగురిలో ఇద్దరు డబ్బును పొదుపు చేయడం తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తమతోపాటు తమ కుటుంబాలను కాపాడుకోవాలనుకుంటున్నట్టు 35శాతం మంది పేర్కొన్నారు. 27 శాతం మంది తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఏడుగురిలో ఒకరు (14 శాతం) ఈ ఏడాదిలో ఇళ్లు లేదా స్థిరాస్థిని కొనుగోలు చేయాలన్న యోచనలో ఉన్నారు. కారు, ఫర్నీచర్ కొనుగోలు చేయాలని 15 శాతం మంది పేర్కొన్నారు.