విదేశాల్లో ఐపీఎల్?.. బీసీసీఐ స్పందన ఇదీ!

ABN , First Publish Date - 2020-07-08T03:35:56+05:30 IST

ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విదేశాల్లో ఐపీఎల్?.. బీసీసీఐ స్పందన ఇదీ!

ముంబై: ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ క్రికెట్ పండుగను విదేశాల్లో నిర్వహించాలని కొందరు సూచించారు. ఈ క్రమంలో తమ దేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ శ్రీలంక, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. తాజాగా న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధుమాల్ మంగళవారం ఓ ప్రకటన చేశారు. ‘ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడానికే ప్రయత్నిస్తాం. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ చిట్టచివరి మార్గం. ఎటూ దారి లేకపోతే అదే చేస్తామేమో? అయితే దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తాం’ అని చెప్పారు. దీంతో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే అవకాశంపై అభిమానులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.

Updated Date - 2020-07-08T03:35:56+05:30 IST