గాంధీ చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-10T05:34:14+05:30 IST
గాంధీ చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
విద్యార్థులతో గాంధీ చలనచిత్రాన్ని వీక్షించిన అదనపు కలెక్టర్, డీఆర్వో
హనుమకొండ రూరల్, ఆగస్టు 9: జాతిపిత మహాత్మాగాంధీ చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం గాంధీ చలనచిత్రాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్కుమార్ హనుమకొండలోని ఏషియన్ శ్రీదేవిమాల్లో గాంధీ చలనచిత్రాన్ని వీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని 12 స్ర్కీన్లలో 4964 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని తిలకించడం జరిగిందన్నారు. విద్యార్థుల సౌకర్యార్దం బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సినిమాహాళ్లలో పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డీఈవో బి.రంగయ్యనాయుడు ఆధ్వర్యంలో సెక్టోరల్ అధికారులు ఏర్పాట్లు చేశారు.