66 అంతస్తుల ప్రాజెక్టు రద్దు
ABN , First Publish Date - 2021-02-28T05:57:02+05:30 IST
రాష్ట్రంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల
కోకాపేటలో భారీ హోటల్ నిర్మాణానికి మంగళం
ఏడాది క్రితం హెచ్ఎండీఏకు ప్రతిపాదన
అనూహ్యంగా ప్రతిపాదనలను విరమించిన సంస్థ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనంగా నిలుస్తుందని భావించిన భారీ ప్రాజెక్టు రద్దయ్యింది. కోకాపేటలో 66 అంతస్తులు, దానిపై హెలీప్యాడ్స్తో రూపొందించిన ప్రాజెక్టు ప్రతిపాదనను నిర్మాణ సంస్థ విరమించుకుంది. ప్రాజెక్టు అంచనాలు తప్పాయా, నిధులను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయా..? అనే విషయాలపై స్పష్టత లేదు. కానీ లాక్డౌన్ తర్వాత నిర్మాణ సంస్థ హెచ్ఎండీఏకు చేసుకున్న దరఖాస్తును విరమించుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్కు పశ్చిమాన ఐటీ కారిడార్ బహుళ అంతస్తుల భవనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలో 20 అంతస్తుల నుంచి 39 అంతస్తుల వరకు భవనాలున్నాయి. ఇటీవల నానక్రాంగూడలో 46 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. అయితే, హైదరాబాద్లో అతిపెద్ద భవన నిర్మాణానికి హెచ్ఎండీఏకు ఏడాదిన్నర క్రితం ప్రతిపాదనలు వచ్చాయి. కోకాపేటలో 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తులో 66 అంతస్తుల భవన నిర్మాణం కోసం ఓ ప్రైవేటు సంస్థ హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. కోకాపేటలోని హెచ్ఎండీఏ నుంచి స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రముఖ హోటల్ సంస్థే ఈ భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. స్టార్ హోటల్, క్లబ్ హౌస్, పలు అంతస్తుల్లో స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, ఐటీ కార్యాలయాలు, హెలీప్యాడ్స్తో భవన నిర్మాణానికి సుమారు రూ.2 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేసినట్లు సమాచారం. అదే భవనం 63వ అంతస్తులో నగర అందాల్ని ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేకంగా స్కైలాంజ్కు కూడా ప్రణాళికలు వేశారు.
ప్రతిపాదనలు విరమణ
భారీ వెంచర్ దరఖాస్తు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ బహుళ అంతస్తుల భవనం పేరుతో కొందరు షేర్లను విక్రయిస్తున్నట్లుగా మోసాలకు తెరలేపి కటకటాల పాలయ్యారు. ఆ భారీ భవనానికి ఎప్పుడు పునాది పడుతుందని ఎదురుచూస్తున్న తరుణంలోనే నిర్మాణ సంస్థ ఆ భారీ ప్రాజెక్టును విరమించుకున్నట్లు తెలిసింది.
అంచనాలు తప్పాయా?
ఐటీ కారిడార్కు ప్రైమ్ ఏరియాగా నిలిచిన కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉండడంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరువలోనే కోకాపేట ఉంది. మొన్నటి వరకు ఎకరం ధర రూ.30 కోట్ల వరకు పలుకగా, ప్రస్తుతం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర ఉంది. భారీ ప్రాజెక్టులకు సాధారణంగా బ్యాంకు రుణాలతో పాటు బుకింగ్ల ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. కొవిడ్-19తో ఏర్పడిన మందగమనం, ఐటీ ఆఫీసులు వెలవెలబోతుండడంతో నిర్మాణ సంస్థ వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయని, అందుకే ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది.