ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-22T06:24:07+05:30 IST
ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ (53) బుధవారం రాత్రి యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు.
చిక్కడపల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ (53) బుధవారం రాత్రి యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. క్వారంటైన్ అనంతరం నెగిటివ్ వచ్చింది. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి 10 గంటలకు మృతిచెందారు. హిప్నో కమలాకర్ జర్నలిస్ట్. న్యాయవాదిగా పనిచేయడంతోపాటు రెండు దశాబ్దాలుగా స్టేజ్ హిప్నాటిస్ట్గా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలాకాలం పనిచేశారు. సైకాలజీ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోని తొలి మహిళా హిప్నాటిస్ట్. పద్మా కమలాకర్ సైకాలజీ రంగంలో రాష్ట్రపతి అవార్డు సాధించారు. కమలాకర్కు కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్ ఉన్నారు. ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి సమీపంలోని నాగుల్లంక గ్రామం. 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్నగర్లో నివసిస్తున్నారు.