పోలీస్‌స్టేషన్‌లో మందుపార్టీ

ABN , First Publish Date - 2020-07-07T15:34:39+05:30 IST

పోలీసు స్టేషన్‌లోనే మందు కొట్టేశారు..

పోలీస్‌స్టేషన్‌లో మందుపార్టీ

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌


హిందూపురం టౌన్‌/అనంతపురం: పోలీసు స్టేషన్‌లోనే మందు కొట్టేశారు కానిస్టేబుళ్లు. వారు మద్యం తాగుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీతో బయటపడ్డాయి. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. హిందూపురం పట్టణంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుళ్లు తిరుమలేశ్‌, నూర్‌మహ్మద్‌, కానిస్టేబుల్‌ గోపాల్‌నాయక్‌ పనిచేస్తున్నారు. హెడ్‌కానిస్టేబుళ్లిద్దరూ అనంతపురంలో నివాసముంటున్నారు. విధులకు హాజరైనప్పుడు పోలీసు స్టేషన్‌ పైఅంతస్తులోని రెస్ట్‌ రూంలో బస చేసేవారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 4వ తేదీన వారిరువురితోపాటు కానిస్టేబుల్‌ గోపాల్‌నాయక్‌ కలిసి రెస్ట్‌ రూంలో బస చేశారు.


సీజ్‌ చేసిన కర్ణాటక మద్యం సీసాల్లో కొన్ని తీసుకొని వారు అక్కడే మద్యం తాగారు. మొత్తం వ్యవహారం సోమవారం బయటకు వచ్చింది. మీడియాలో ప్రసారమైంది. ఈ ఘటన జిల్లాలో సంచలనమైంది. ఎస్పీ సత్యయేసుబాబు దీనిని సీరియ్‌సగా పరిగణించారు. వెంటనే దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌బాషాను ఆదేశించారు. డీఎస్పీ స్టేషన్‌లో విచారించి, నివేదికను ఎస్పీకి అందజేశారు. గంటల వ్యవధిలోనే ఆ ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.


సిబ్బందే లీక్‌ చేశారా?

స్టేషన్‌లో మద్యం సేవించటం తప్పే కానీ, విషయం మీడియాకు లీక్‌ చేయటాన్ని ఎస్పీ సీరియ్‌సగా పరిగణిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. దీనిని ఎవరు బయటకు పంపారో విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సస్పెండైన కానిస్టేబుల్‌ గోపాల్‌నాయక్‌ తనకు మద్యం తాగే అలవాటు లేదనీ, విశ్రాంతి తీసుకోవటానికి గదిలోకి వెళ్లానని చెప్పుకొస్తున్నాడు. తనను బలిచేయటం బాధాకరమనీ, ఎస్పీకి సమస్యను విన్నవించుకుంటానని విలేకరులతో తెలిపాడు.

Updated Date - 2020-07-07T15:34:39+05:30 IST