YCP MPపై తిరగబడ్డ సొంత పార్టీ మహిళా కౌన్సిలర్లు
ABN , First Publish Date - 2022-05-31T20:07:03+05:30 IST
Hindupuram: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ (YCP) అంతర్గత కుమ్ములాట జరిగింది.
Hindupuram: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ (YCP) అంతర్గత కుమ్ములాట జరిగింది. హిందూపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav)ను వైసీపీ మహిళా కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఇంద్రజ, ఎంపీ గోరంట్ల మాధవ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. హిందూపురం మున్సిపాలిటీ ప్రాంతంలో డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారపార్టీ మహిళా కౌన్సిలర్లు సమస్యలు లేవనెత్తారు.
హిందూపురంలో ఏ ప్రభుత్వం వచ్చినా పీఏల రాజ్యం సాగుతోందని మహిళా కౌన్సిలర్ ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ.. మహిళా కౌన్సిలర్ మాట్లాడుతున్న మైక్ కట్ చేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు కౌన్సిలర్, కమిషనర్ ఎందుకంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ గోరంట్ల చేసేదేమీ లేక సమావేశాన్ని ముగించారు.