సీఎం జగన్ పాలనపై బాలయ్య ఆగ్రహం.. మహానాడులో విమర్శలు
ABN , First Publish Date - 2022-05-29T00:38:35+05:30 IST
ఏపీ సీఎం జగన్పై టీడీపీ మహానాడులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలు చేశారు. జగన్ మూడేళ్ల పాలనలో ధరలు విపరీతంగా..
Ongole: ఏపీ సీఎం జగన్ (jagan)పై టీడీపీ మహానాడులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) విమర్శలు చేశారు. జగన్ మూడేళ్ల పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని.. అన్ని రకాల ఛార్జీల రేట్లు కూడా పెంచేశారని మండిపడ్డారు. ‘దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టొయ్’ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. టీడీపీ (Tdp)ని అధికారంలోకి తెస్తేనే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని... టీడీపీకి ప్రజాశీస్సులు ఇవ్వాలని కోరారు.
‘‘తెలుగు వారు కాని వారు కూడా తెలుగోళ్లను గుర్తుపట్టేలా చేసిన ఘనత ఎన్టీఆర్దే. ఓటంటే నోటు కాదు. గుడినే కాదు గుళ్లో లింగాన్ని కూడా మింగేసేవాళ్లున్నారు. నువ్వు-నేను కలిస్తే మనం.. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం. ఇప్పుడు మహానాడుకు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది.శత పురుషుడి శత జయంతి జరుపుకుంటున్నాం. పేదొడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని తపించేవారు ఎన్టీఆర్. ఎన్టీఆర్(Ntr) పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి.’’ అని బాలకృష్ణ తెలిపారు.