సంపత్ప్రదాతలు కొలువైన చోటు!

ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST

సకల సంపదలనూ ప్రసాదించే దేవతగా లక్ష్మీదేవి పూజలందుకుంటోంది. ఆ సంపదలను అర్హులకు చేరవేసే నిర్వాహకుడిగా కుబేరుడు ప్రసిద్ధి చెందాడు. లక్ష్మీ ఆరాధనతో పాటు కుబేర పూజ చేసేవారికి ఐశ్వర్యం లభిస్తుందన్నది అనాది విశ్వాసం...

సంపత్ప్రదాతలు కొలువైన చోటు!

సకల సంపదలనూ ప్రసాదించే దేవతగా లక్ష్మీదేవి పూజలందుకుంటోంది. ఆ సంపదలను అర్హులకు చేరవేసే నిర్వాహకుడిగా కుబేరుడు ప్రసిద్ధి చెందాడు. లక్ష్మీ ఆరాధనతో పాటు కుబేర పూజ చేసేవారికి ఐశ్వర్యం లభిస్తుందన్నది అనాది విశ్వాసం. మన దేశంలో లక్ష్మీ మందిరాలు అసంఖ్యాకం. కుబేరుడికి ప్రత్యేకించిన ఆలయాలు లేవు. అయితే కుబేరుడితో సహా శ్రీ మహాలక్ష్మి కొలువైన ఒక గుడి తమిళనాడు రాజధాని చెన్నై నగర శివార్లలో... వండలూరుకు సమీపంలోని రత్నమంగళంలో ఉంది. అదే శ్రీలక్ష్మీ కుబేర ఆలయం. 


కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. యక్షరాజు. అతను రావణుడికి సోదరుడనీ, లంకా నగరానికి అధిపతి అనీ, అతణ్ణి రావణుడు తరిమేసి, లంకనూ, పుష్పక విమానాన్నీ స్వాధీనం చేసుకున్నాడనీ కొన్ని పురాణ కథనాలు చెబుతున్నాయి.. కుబేరుడు శివుడికి మహా భక్తుడు. శివానుగ్రహంతో నవ నిధులనూ పొందిన కుబేరుడు ధనప్రదాతగా పేరుపొందాడు. ఆయన మహాలక్ష్మి అధిదేవతగా... భార్య చిత్రలేఖా సమేతుడై రత్నమంగళంలో కొలువుతీరాడని స్థానికుల కథనం.

గర్భగుడిలో లక్ష్మిదేవి, సతీసమేతుడైన కుబేరుడి విగ్రహాలు సమున్నతంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే కుబేర లింగం, బ్రహ్మ-సరస్వతి, లక్ష్మీ గణపతి, శ్రీ వేంకటేశ్వర స్వామి, షోడశ గణపతులు, యోగాంజనేయ స్వామి, భార్యాసమేతంగా నవగ్రహాలతో సహా వివిధ దేవతల విగ్రహాలు ఉన్నాయి. లాఫింగ్‌ బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినాన శ్రీ లక్ష్మీ కుబేర ఆలయంలో విశేష పూజలు జరుపుతారు. ప్రధాన దేవతామూర్తులను కరెన్సీ నోట్లతో అలంకరిస్తారు. దీపావళి నాడు మహాలక్ష్మినీ, కుబేరుణ్ణీ పూజిస్తే అష్టైశ్వర్యాలూ లభిస్తాయని భక్తుల నమ్మకం. అలాగే వైకుంఠ ఏకాదశి, అక్షయ తృతీయ, కుబేర కళ్యాణోత్సవంతో సహా అనేక ఉత్సవాలను ఈ ఆలయంలో నిర్వహిస్తారు. నిత్య పూజల్లో నాణేలు, కరెన్సీ నోట్లు వినియోగించడం మరో విశేషం.

Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST