సీఎం ముందే సెక్యూరిటీ చెంప చెళ్లుమనిపించిన ఎస్పీ

ABN , First Publish Date - 2021-06-24T18:59:06+05:30 IST

కులులో ఓ ఎస్పీ రెచ్చిపోయారు. ఏకంగా సీఎం సెక్యూరిటీ సిబ్బందిపైనే తన ప్రతాపం చూపించారు.

సీఎం ముందే సెక్యూరిటీ చెంప చెళ్లుమనిపించిన ఎస్పీ

హిమాచల్ ప్రదేశ్: కులులో ఓ ఎస్పీ రెచ్చిపోయారు. ఏకంగా సీఎం సెక్యూరిటీ సిబ్బందిపైనే తన ప్రతాపం చూపించారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఎస్పీ గౌరవ్ సింగ్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడే ఉన్న ఇతర సీఎం సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తీరుకున్న ఆఫీసర్‌కు కోపం వచ్చింది. మమ్మల్నే కొడతావా అంటూ ఎస్పీని కాలితో తన్నారు. అలా ఎస్పీని తన్నుకుంటూ.. తరుముకుంటూ వెళ్లారు. దీంతో ఎస్పీ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ, సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఇద్దరిని పక్కకు లాగి గొడవను సద్దుమణిగేలా చేశారు.


ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తన కారులోనే కూర్చొని ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ పోర్టుకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న డీజీపీ ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం సెక్యూరిటీని ఎస్పీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఇదిలా ఉండగా నితిన్ గడ్కరీ వస్తుండగా ఆయన కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన రహదారి విస్తరణలో తమ భూమిని కోల్పోయామని దానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని మరింత పరిహారం ఇవ్వాలని బాధితులు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-24T18:59:06+05:30 IST