హైరిస్క్‌ కేసులను ముందుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2022-05-18T05:46:05+05:30 IST

ప్రతీ గర్భిణికి ఆరోగ్య లక్ష్మి కింద పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు.

హైరిస్క్‌ కేసులను ముందుగా గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెకర్టర్‌ ఎస్‌. వెంకట్రావు

 - జిల్లాలో ఒక్క మాతృ మరణమూ జరగకూడదు

-మాతా, శిశు మరణాలపై సమీక్షించిన కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 17 : ప్రతీ గర్భిణికి ఆరోగ్య లక్ష్మి కింద పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. గర్భిణుల్లో హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో మాతృ, శిశు మరణాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. సాధారణ కాన్పులు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పౌష్టికాహారం లోపం వల్లే హైరిస్క్‌లో పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు చేయాలని, హైదరాబాద్‌ లాంటి ఇతర ఆసుపత్రులకు రెఫర్‌ చేయ వద్దని, ఇందుకు గర్భిణిపై ముందు నుంచే దృష్టి సారించాలన్నారు. ఎంతగానో టెక్నాలోజీ అభివృద్ధి అయినప్పటికీ 16 మాతృ మరణాలు జరగడం శోచనీయ మని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీదట అలా జరుగరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, ఎంహెచ్‌ఎన్‌ డాక్టర్‌ భాస్కర్‌, హెచ్‌వోడీ గైనిక్‌ డాక్టర్‌ రాధ, డీడబ్య్లూవో జరీనా, తదితర డాక్టర్లు హాజరయ్యారు.

Updated Date - 2022-05-18T05:46:05+05:30 IST