అత్యంత విషమం

ABN , First Publish Date - 2020-09-25T08:01:46+05:30 IST

‘బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది’ అంటూ ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం ప్రకటించింది...

అత్యంత విషమం

  • 24 గంటల్లో క్లిష్టంగా మారిన బాలు ఆరోగ్యం
  • చెన్నై ఎంజీఎం ఆస్పత్రి ప్రకటన.. ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
  • ఆస్పత్రికి చేరుకున్న కుటుంబీకులు.. అంతకుముందే వచ్చి వెళ్లిన కమల్‌


చెన్నై, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి బాగుందని కొన్నిరోజులుగా చెబుతూనే ఉన్నారు! ఆయన కోలుకునే అవకాశాలు మెరుగుపడుతున్నాయని వైద్యులూ చెప్పారు!! ‘ఇక రేపో మాపో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారు’ అని అభిమానులంతా ఆశించారు! కానీ.. అంతలోనే పిడుగులాంటి వార్త. ‘బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది’ అంటూ ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనతో లక్షలాది మంది అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది!! కరోనా బారిన పడ్డ ఎస్పీ బాలు గత నెల 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వారం తర్వాత ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అవసరమైంది. కొన్నాళ్లుగా ‘ఎక్మో’ ద్వారా అత్యంత అధునాతన చికిత్స అందిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు ‘కరోనా నెగెటివ్‌’ కూడా వచ్చింది. బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్‌ కూడా ప్రకటించారు. కొన్నాళ్లుగా ఆస్పత్రి వర్గాలు బాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో... అంతా కుదుటపడిందనే అనుకున్నారు. కానీ.. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఎక్మోపై ఉన్నారు. ఇతర ప్రాణ రక్షణ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తున్నాం. అయితే... గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా విషమించింది. అత్యంత గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. ఆయన పరిస్థితిని నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు’’ అని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం 

ప్రకటించింది.


విషాద వాతావరణం

బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒక్కొక్కరుగా ఆస్పత్రి వద్దకు చేరుకోసాగారు. రాత్రి 7.30 గంటల సమయంలో బాలు సన్నిహితుడు, సినీ నటుడు  కమల్‌ హాసన్‌ ఆస్పత్రికి వచ్చారు. తన స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి తిరిగి వెళుతూ... మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. ‘‘బాలు ఆరోగ్య పరిస్థితి సీరియ్‌సగానే ఉంది. ప్రాణ రక్షణ పరికరాలతో చికిత్సలు అందిస్తున్నారు. లక్షలాదిమంది అభిమానులు, సినీ రంగ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని వారు విశ్వసించే భగవంతుడిని ప్రార్థిస్తున్నారు’’ అని కమల్‌ పేర్కొన్నారు. రాత్రి 9 గంటల  సమయంలో బాలు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కొందరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులూ అక్కడ గుమికూడారు. ‘బాలు తిరిగి రావాలి’ అంటూ ప్రార్థనలు చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద  ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ప్రసారమాధ్యమాల్లో కూడా నిరంతరాయంగా బాలు ఆరోగ్యంపై వార్తలు ఇస్తూనే ఉన్నారు. లక్షలాది మంది అభిమానులు.. ఆయన గురించి, ఆయన సాధించిన ఘనతల గురించి, అవార్డులు, రివార్డుల గురించి సామాజిక మాధ్యమాల్లో గుర్తుచేసుకున్నారు. భగవంతుడి దయతో ఆయన కోలుకోవాలని ప్రార్థించారు. బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే ఇతర వైద్యనిపుణులతో కూడా సంప్రదించి బాలుకు మరింత మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే.. బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. కాగా.. బాలు ఆరోగ్య పరిస్థితిపై గురువారం రాత్రి పొద్దుపోయాక మరో బులెటిన్‌ విడుదల చేస్తామని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు రాత్రి 1.30 గంటల దాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కుటుంబసభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.

Updated Date - 2020-09-25T08:01:46+05:30 IST