రాష్ట్రంలోనే అత్యధికం
ABN , First Publish Date - 2022-01-29T04:58:27+05:30 IST
జిల్లాలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.
కర్నూలు(హాస్పిటల్), జనవరి 28: జిల్లాలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,710 కేసులు వెలుగు చూశాయి. 6,117 శాంపుల్స్ సేకరించగా.. పాజిటివిటీ 27.95 శాతంగా నమోదైంది. శుక్రవారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ నందికొట్కూరు రూరల్కు చెందిన ఒకరు, కర్నూలు నగరానికి చెందిన ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 859కు చేరింది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,37,965కు చేరగా.. యాక్టివ్ కేసులు 9,964 ఉన్నాయి. కర్నూలు నగరంలో 409, నంద్యాల మున్సిపాలిటీలో 266 కేసులు నమోదయ్యాయి.
168 మంది విద్యార్థులకు పాజిటివ్
కర్నూలు(న్యూస్ నెట్వర్క్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన సేకరించిన నమూనాలు సేకరించగా 168 మంది విద్యార్థులు, 22 మంది ఉపాధ్యాయులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ప్యాపిలి కేజీబీవీలో ఐదుగురు బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 50 మంది బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. బాధితులకు మందులు ఇచ్చి హోం క్వారంటైన్కు పంపామన్నారు.
మద్దికెరలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నాగేష్ తెలిపారు.
హొళగుంద మండలం గజ్జహల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల విద్యాధికారి ఈరన్న తెలిపారు. మధ్యాహ్నం నుంచే విద్యార్థులను ఇళ్లకు పంపామన్నారు.
బనగానపల్లె మండలం పసుపుల ప్రాథమిక పాఠశాలలో 9 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా సోకినట్లు టంగుటూరు వైద్యాధికారి శివశంకరుడు తెలిపారు.
కోవెలకుంట్ల జూనియర్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపాల్ మద్దిలేటిస్వామి తెలిపారు.
పాణ్యం మండలం కొండజూటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు, ముగ్గురు ఉపాఽఽధ్యాయులకు వైరస్ సోకినట్లు ఎంఈవో కోటయ్య తెలిపారు. రెండు రోజులు పాఠశాలకు సెవలు ప్రకటించామన్నారు.
రుద్రవరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 14 మంది విద్యార్థినులకు, రుద్రవరం ఉన్నత పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు గాయత్రి తెలిపారు.
గడివేముల ఆదర్శ పాఠశాలలో 10 మందికి కరోనా సోకినట్లు ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు. వీరిలో బోధనేతర సిబ్బంది ఐదుగురు, విద్యార్థులు ఐదుగురు ఉన్నారన్నారు.