కరోనాతో మెదడుకు తీవ్ర ముప్పు

ABN , First Publish Date - 2020-07-09T07:49:36+05:30 IST

కరోనాతో పలు రకాలైన నాడీ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయని లండన్‌లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు...

కరోనాతో మెదడుకు తీవ్ర ముప్పు

లండన్‌, జూలై 8: కరోనాతో పలు రకాలైన నాడీ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయని లండన్‌లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, మెదడుకు స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు.


వైరస్‌ సరాసరి మెదడుపై దాడి చేయనప్పటికీ.. పరోక్షంగా మెదడుపై దాడి జరుగుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు.. కొంతమంది విషయంలో వైర్‌సపై వారి శరీర రక్షణ వ్యవస్థ స్పందించే తీరు, మెదడుపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలిందని వారు వెల్లడించారు. ఈ మేరకు తమ పరిశోధనల వివరాలను ‘బ్రెయిన్‌’ పత్రికలో ప్రచురించారు. దాని ప్రకారం.. అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే అనారోగ్యం, కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. ఒకప్పుడు నెలకు ఒక రోగి మాత్రమే ఈ అరుదైన పరిస్థితితో వైద్యులను సంప్రదిస్తే.. కరోనా విజృంభణ అనంతరం వారానికి ఒకరు దీని బాధితులుగా మారుతున్నారు. కరోనా సోకిన 43మంది రోగుల నాడీ వ్యవస్థ ల్ని పరిశోధించిన మీదట, వారిలో చాలామందిలో శ్వాస సంబంధిత సమస్య కంటే, నాడీ సంబంధిత రుగ్మతలే ఎక్కువగా కనిపించాయి. అయితే.. కరోనా వల్ల ఆ స్థాయిలో మెడదు సమస్యలు తలెత్తుతాయని ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-09T07:49:36+05:30 IST