వరకట్నం వేధింపుల కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-02-22T07:40:50+05:30 IST
వరకట్న వేధింపుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తిరగ రాసింది. సంశయలాభం కింద కింది కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది...
కింది కోర్టు తీర్పు పొరబాటు: హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వరకట్న వేధింపుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తిరగ రాసింది. సంశయలాభం కింద కింది కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ట్రయల్ కోర్టు కేసు పూర్వపరాలను, చట్టాలను అన్వయించడంలో పొరపాటు పడిందని వ్యాఖ్యానించింది. పెళ్లయిన కొద్దికాలానికే అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి గృహిణి మృతి చెందిందని, సాక్షుల వాంగ్మూలాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయనే కారణంతో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం సరికాదని అభిప్రాయపడింది. వివాహిత మరణానికి కారణమైన భర్త దుడ్ల సంతోష్, అత్త దుడ్ల బాలమణి, మామ దుడ్ల నర్సింహులుకు ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.20వేల చొప్పున జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. మృతురాలి తల్లికి పరిహారం కింద రూ.50వేలు చెల్లించాలని, ఆమె లేకపోతే మృతురాలి సోదరునికి లేదా ఆ కుటుంబీకులకు చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా ఎల్పాపూర్కు చెందిన తలారి భాగ్యలక్ష్మికి నర్సాపూర్కు చెందిన దుడ్ల సంతో్షతో 2010 మే 16న పెళ్లి అయ్యింది. కట్నం కింద ఎకరా 20 గుంటల భూమి, 8 తులాల బంగారం, గృహోపకరణాల కోసం రూ. లక్ష ఇచ్చారు. ఐదారు నెలల తర్వాత భర్త, అత్త,మామలు అదనపు కట్నంకోసం భాగ్యలక్ష్మిని వేధించసాగారు. అ తర్వాత నెలకే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అత్తింటివారు సమాచారమిచ్చారు. ఈ కేసును విచారించిన నర్సాపూర్లోని మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2013 జనవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై మృతురాలి సోదరుడు కృష్ణ హైకోర్టులో అప్పీలు చేశారు.