విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2022-05-25T05:26:32+05:30 IST
వ్యవసాయ పంటల సాగులో మేలైన విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు లభిస్తాయని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీదేవి సూచించారు.
సిద్దిపేట రూరల్, మే 24: వ్యవసాయ పంటల సాగులో మేలైన విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు లభిస్తాయని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీదేవి సూచించారు. మంగళవారం పరిశోధన కేంద్రంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాల ప్రాముఖ్యత, విత్తనాలు నాటడానికి నేలను దుక్కుల చేయటం, సరైన సమయంలో విత్తనాలు నాటడం వంటి అంశాలను రైతులకు వివరించారు. జేజీఎల్ జగిత్యాల రైస్ 24423 (దొడ్డు రకం) 25 కిలోల బస్తా రూ.1,000, కేఎన్ఎం 118 కూనారం సన్నాలు (దొడ్డు రకం) 25 కిలోల బస్తా రూ.1,000, డబ్ల్యూజీఎల్ సద్ది (సన్నరకం) 25 కిలోల బస్తా రూ.1,100, కంది రకం డబ్ల్యూ ఆర్జీఈ 97 వరంగల్ కంపెనీ 1, మూడుకిలోల బస్తా రూ.390 చొప్పున విక్రయానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సిద్దిపేటరూరల్ మండలంలోని తోర్నాల, బుస్సాపూర్, పుల్లూరు, నారాయణరావుపేటలోని ఇబ్రహీంపూర్, దుబ్బాక మండలంలోని అప్పనపల్లి, బెజ్జంకిలోని గాగిల్లాపూర్ గ్రామాల నుంచి రైతులు మేళాకు హాజరై 160 విత్తనాల బస్తాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పరశురాంరెడ్డి, తోర్నాల సర్పంచ్ దేవయ్య పాల్గొన్నారు.