ఖైదీ ఇన్స్పెక్టర్కు హై సెక్యూరిటీ, ఐసొలేటెడ్ సెల్
ABN , First Publish Date - 2022-07-13T10:18:10+05:30 IST
అత్యాచారం కేసులో అరెస్టయిన ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు న్యాయమూర్తి 15 రోజుల రిమాండు విధించిన నేపథ్యంలో..
- జైల్లో శత్రువులు ఉండే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త
- తాను ఛేదించిన సంచలన కేసుల గురించి జైలు అధికారులకు
- తెలిపిన నాగేశ్వరరావు.. న్యాయం తనవైపే ఉందని ధీమా
- తనను ట్రాప్ చేసి ఇరికించారని వెల్లడి
హైదరాబాద్ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసులో అరెస్టయిన ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు న్యాయమూర్తి 15 రోజుల రిమాండు విధించిన నేపథ్యంలో.. మంగళవారం ఉదయం పోలీసులు అతణ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు అధికారులు అక్కడ అతణ్ని అత్యధిక భద్రత ఉన్న ఐసొలేటెడ్ సెల్లో ఉంచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. జైలు అధికారులు ఉదయం ఖైదీలతో మాట్లాడే సమయంలో నాగేశ్వరరావు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్టయి నల్గొండలో కొంతకాలం పాటు కానిస్టేబుల్గా ఉద్యోగం చేశానని, ఆ తర్వాత 2004లో పోలీస్ రిక్రూట్మెంట్కు సన్నద్ధమై ఎస్సైగా ఉద్యోగం సంపాదించానని వెల్లడించాడు. ఎస్సైగా ఎన్నో సంచలన కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించానని.. అంతర్రాష్ట్ర దొంగలను, డ్రగ్స్ స్మగ్లర్లను పట్టుకుని కటకటాల్లోకి నెట్టానని పేర్కొంటూ.. తన అనుభవాలు, ప్రతిభాపాటవాల గురించి వారికి వివరించాడు. ఈ విషయాలన్నీ విన్నాక.. జైల్లో ఆయనకు శత్రువులు ఉండే ప్రమాదం ఉందని భావించిన జైలు అధికారులు అతణ్ని ఐసోలేటెడ్ సెల్ ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. తనను కావాలనే ట్రాప్ చేసి, ఈ కేసులో ఇరికించారని.. తాను ఏ తప్పూ చేయలేదని నాగేశ్వరరావు జైలు అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. న్యాయం తన వైపే ఉందని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకొస్తాయని ఽధైర్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా.. నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టు ఎక్కడా బయటకు రాకుండా పోలీసులు గోప్యత పాటిస్తుండడం గమనార్హం.