పంతం నెగ్గించుకున్న రాహుల్..
ABN , First Publish Date - 2021-10-06T21:05:42+05:30 IST
పంతం నెగ్గించుకున్న రాహుల్..
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో బుధవారం మధ్యాహ్నం లక్నో విమానాశ్రయంలో తలెత్తిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. రాహుల్ తన సొంత వాహనంలో లఖింపూర్ కేరి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంతో రాహుల్ బైఠాయింపు నిరసన విరమించారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, సొంత వాహనంలో అక్కడ్నించి బయలుదేరారు. దీనికి ముందు విమానాశ్రయంలో రాహుల్ను పోలీసు సిబ్బంది అడ్డుకుంది. తమ పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టింది. ఇందుకు రాహుల్ నిరాకరిస్తూ, తన సొంత వాహనంలోనే వెళ్తానంటూ బైఠాయింపు నిరసనకు దిగారు. రాహుల్తో పాటు ఆయన వెంట ఉన్న ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘెల్, పంజాబ్ సీఎం ఛన్నీ కూడా బైఠాయించారు. ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. లఖింపూర్లో గత ఆదివారంనాడు చెలరేగిన హింసాకాండలో చనిపోయిన కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు.