ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-09-24T21:18:42+05:30 IST

ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. ఈ లేఖని ఆమోదిస్తూ ఆగస్ట్‌ 12న 776 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని..

ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

అమరావతి: పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై తాజాగా పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు సురేష్‌కుమార్, చాణక్య వాదనలు వినిపించారు. ఇలాంటి నేరాలు భవిష్యత్‌లో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో తావిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.


వాదనలు విన్న జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం.. జీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవోలోని భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు. పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.


ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. ఈ లేఖని ఆమోదిస్తూ ఆగస్ట్‌ 12న 776 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్‌హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Updated Date - 2020-09-24T21:18:42+05:30 IST