మద్యం బానిసలకు లిక్కర్ అమ్మకాలపై హైకోర్టు స్టే!

ABN , First Publish Date - 2020-04-03T18:13:37+05:30 IST

లాక్‌డౌన్ సందర్భంగా మద్యపానానికి బానిసైన వారికి మద్యం సరఫరా చేయాలంటూ కేరళ ప్రభుత్వం తీసుకున్న...

మద్యం బానిసలకు లిక్కర్ అమ్మకాలపై హైకోర్టు స్టే!

కొచ్చి: లాక్‌డౌన్ సందర్భంగా మద్యపానానికి బానిసైన వారికి మద్యం సరఫరా చేయాలంటూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఆల్కహాల్ విత్‌‌డ్రాల్ సిండ్రోమ్ ఉన్నట్టు మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న మద్యం బానిసలకు లిక్కర్ సరఫరా చేసేలా ప్రభుత్వం ఇటీవల ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్, కేరళ ప్రభుత్వ వైద్య అధికారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, జస్టిస్ షాజి పి చలేలతో కూడిన డివిజన్ బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. 


మద్యానికి బానిసైన వారికి శాస్త్రీయంగా చికిత్స జరగాలనీ.. వీరికి ఏ వైద్యుడూ మద్యం తాగమని సూచించలేరని వైద్యాధికారుల సంఘం వాదించింది. అలాంటివారికి మద్యం అందించడం వైద్య శాస్త్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం తరపున రాష్ట్ర అటార్నీ జనరల్ కేవీ సోహాన్ వాదనలు వినిపిస్తూ... ఆల్కహాల్ విత్‌‌డ్రాల్ చికిత్సలో భాగంగా కొద్ది మోతాదులో మద్యం తీసుకోవడం ఎప్పటినుంచో ఉన్నదేనని పేర్కొన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మద్యపాన బానిసలకు మితమైన మోతాదులో లిక్కర్ అందించాలని వైద్య శాస్త్రంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవించే ఓ వ్యక్తి ఉన్నపళంగా దాన్ని నిలిపివేయడం ద్వారా బయటపడే లక్షణాలను ఆల్కహాల్ విత్‌‌డ్రాల్ సిండ్రోమ్ అంటారు. 

Updated Date - 2020-04-03T18:13:37+05:30 IST