ఇద్దరు యువతుల సహజీవనం.. రక్షణ కల్పించాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2021-11-20T14:26:54+05:30 IST
లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ఇద్దరు..
లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ఇద్దరు యువతులు తమకు రక్షణ కల్పించాని కోరుతూ చేసుకున్న అభ్యర్థనపై ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉంటున్న ఈ ఇద్దరు స్వలింగ సంపర్కులకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. హాపుర్ పరిధిలోని పంచశీల్ నగర్కు చెందిన యువతి అంజూ సింగ్తో పాటు ఆమె భాగస్వామిలకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటీషన్పై జస్టీస్ కేజే ఠాకర్, జస్టిస్ అజయ్ త్యాగిల డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.
ఈ స్వలింగ సంపర్క యువతులు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో.. తమకు కోర్టు రక్షణ కల్పించకపోతే తాము కలసి జీవించలేమని పేర్కొన్నారు. తమ ఇరు కుటుంబాలకు చెందినవారు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమను ప్రశాంతంగా జీవించనివ్వడంలేదని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము మేజర్లమని, తాము లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండాలని నిశ్చయించుకున్నామని, అయితే తమ తల్లిదండ్రులు తమని విడదీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు ఆ యువతులకు రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేసింది.