రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2021-09-17T22:14:04+05:30 IST
సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ జరపాలని వరంగల్ మూడో మెజిస్ట్రేట్ను న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రాజు మృతిపై పౌరహక్కుల సంఘం నేత హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. రాజును పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ ఆరోపించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందని హైకోర్టుకు ఏజీ నివేదిక ఇచ్చారు. వీడియోలను శనివారం రాత్రి 8లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే రాజు ఆత్మహత్యపై అతడి తల్లి, భార్య కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను పోలీసులే చంపారని.. చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు భార్య మౌనిక ఆరోపించారు. రాజు దొరికాడని, అతణ్ని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పుకోవడం తాము విన్నామని మౌనిక తెలిపింది. ‘‘ఒక్కగానొక్క కొడుకు ఇలా పోయాడు. వాణ్ని పోలీసులే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. నేను, నా కోడలు, మనుమరాలు అనాథలమయ్యాం. ఆదివారమే దొరికాడన్నారు. మళ్లీ దొరకలేదన్నారు. బుధవారం రాత్రి మమ్మల్ని పంపించేటప్పుడు.. కోడలిని, మనుమరాలిని మంచిగా చూసుకోమని చెప్పారు. అప్పుడే మాకు అనుమానం కలిగింది’’ అని రాజు తల్లి ఈరమ్మ వాపోయారు.