దళిత విద్యార్థినికి అండగా నిలిచిన హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2021-11-30T22:54:14+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దళిత విద్యార్థిని కలలు సాకారం కావడం

దళిత విద్యార్థినికి అండగా నిలిచిన హైకోర్టు జడ్జి

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దళిత విద్యార్థిని కలలు సాకారం కావడం కోసం అలహాబాద్ హైకోర్టు లక్నో దర్మాసనం జడ్జి ఒకరు సహకరించారు. ఐఐటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డ్యూయల్ డిగ్రీ కోర్సులో చేరేందుకు ఆమెకు రూ.15,000 ఆర్థిక సాయం చేశారు. సీట్లు ఖాళీ లేకపోతే సూపర్‌న్యూమరరీ సీటును సృష్టించి, ఆమెకు ప్రవేశం కల్పించాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు. 


దళిత విద్యార్థిని సంస్కృతి రంజన్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఆమెకు ఐఐటీ, బీహెచ్‌యూలో డ్యూయల్ డిగ్రీ కోర్సులో సీటు లభించింది. నిర్ణీత గడువులోగా ఆమె రూ.15,000 చెల్లించలేకపోయారు. ఆమె తండ్రి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. తమ ఇబ్బందులను తెలియజేస్తూ, గడువును పొడిగించాలని కోరినప్పటికీ విశ్వవిద్యాలయం సానుకూలంగా స్పందించలేదు. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. 


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ మానవత్వంతో స్పందించారు. సంస్కృతి రంజన్‌ను ఐదేళ్ళ బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులో చేర్చుకోవాలని ఐఐటీ, బీహెచ్‌యూను ఆదేశించారు. సీట్లు ఖాళీ లేకపోతే ఓ సూపర్‌న్యూమరరీ సీటును సృష్టించాలని ఆదేశించారు. 


అవసరమైన పత్రాలను తీసుకుని మూడు రోజుల్లోగా బీహెచ్‌యూలో సంప్రదించాలని సంస్కృతిని ఆదేశించారు. కోర్టు పని వేళలు ముగిసిన తర్వాత సంస్కృతికి రూ.15,000 ఇచ్చారు. 


Updated Date - 2021-11-30T22:54:14+05:30 IST