గుజరాత్ మత స్వేచ్ఛ చట్టంపై హైకోర్టు ఆంక్షలు

ABN , First Publish Date - 2021-08-19T23:17:45+05:30 IST

గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్ల అమలును

గుజరాత్ మత స్వేచ్ఛ చట్టంపై హైకోర్టు ఆంక్షలు

గాంధీనగర్ : గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్ల అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపేసింది. మతాంతర వివాహాలకు సంబంధించిన ఈ సెక్షన్ల అమలును నిలిపేస్తూ గురువారం తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. నిర్బంధం, ఒత్తిడి లేదా దురాశతో వివాహం జరిగినట్లు రుజువయ్యే వరకు ఈ చట్టం ప్రకారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేయరాదని తెలిపింది. 


మత స్వేచ్ఛ సవరణ చట్టం ప్రకారం మతాంతర వివాహం జరిగినపుడు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని, ఆ వివాహం నేరపూరితమైనదని ఆరోపించవచ్చునని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది వాదనలు వినిపిస్తూ, మత స్వేచ్ఛ చట్ట నిబంధనలకు పిటిషనర్ ఇచ్చిన వివరణ సరైనది కాదన్నారు. తప్పుడు పద్ధతుల్లో బెదిరించి పెళ్లి చేసుకున్నవారు మాత్రమే భయపడవలసి ఉంటుందన్నారు. 


పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం అనేక ఫిర్యాదులు దాఖలవుతున్నాయని, పోలీసు అధికారులు దీనిని ఏ విధంగా అర్థం చేసుకుని, వివరిస్తారో పరిశీలించాలని హైకోర్టును కోరారు. 


హైకోర్టు స్పందిస్తూ, గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లకు జరిగిన సవరణల అమలుపై ఆంక్షలు విధించింది. మతాంత వివాహాలకు సంబంధించిన కేసుల్లో కేవలం వివాహం ప్రాతిపదికపైనే ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయవద్దని తెలిపింది. 


గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో మత స్వేచ్ఛ చట్టం, 2021ని ఆమోదించింది. వివాహం ద్వారా బలవంతపు మత మార్పిడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటువంటి చట్టాలను ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ కూడా చేశాయి.


Updated Date - 2021-08-19T23:17:45+05:30 IST