కుటుంబాల నుంచి కాపాడమన్న ప్రేమ జంటకు రూ.10 వేలు జరిమానా వేసిన హైకోర్టు
ABN , First Publish Date - 2020-06-03T20:29:56+05:30 IST
పంజాబ్కు చెందిన యువ జంట తమ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా
చండీగఢ్ : పంజాబ్కు చెందిన యువ జంట తమ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని, తమకు రక్షణ కల్పించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరు పెళ్లి సమయంలో మాస్క్లు ధరించలేదనే కారణంతో వీరిద్దరికీ ఖర్చుల క్రింద రూ.10,000 విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
నవ దంపతుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని గురుదాస్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నవ దంపతులు తమ పిటిషన్తోపాటు సమర్పించిన పెళ్లి ఫొటోలను హైకోర్టు పరిశీలించింది. పెళ్లి సమయంలో వధూవరులతోపాటు, హాజరైనవారు కూడా కోవిడ్-19 నిబంధనల ప్రకారం ముఖాలకు మాస్క్లు ధరించలేదని గుర్తించింది. హోషియార్పూర్ డిప్యూటీ కమిషనర్కు రూ.10,000 చెల్లించాలని నవ దంపతులను ఆదేశించింది. ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని చెప్తూ, దీనిని హోషియార్పూర్ జిల్లాలో ప్రజలకు మాస్క్లను పంపిణీ చేయడానికి ఉపయోగించాలని ఆదేశించింది.