ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఝలక్

ABN , First Publish Date - 2021-03-19T22:43:35+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఝలక్

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు.


రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాను, టీడీపీ సభ్యుల కు వ్యతిరేకంగా పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేశారన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 12న సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-03-19T22:43:35+05:30 IST