వరదలపై అప్రమత్తం
ABN , First Publish Date - 2022-05-28T09:45:48+05:30 IST
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ముంచుకొస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. జూన్ 16వ తేదీ నుంచి డిసెంబరు
- నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద హైఅలర్ట్
- రాష్ట్రమంతటా ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ముంచుకొస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. జూన్ 16వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ దాకా రాష్ట్రమంతటా ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయా కంట్రోల్ రూమ్లు వర్షాకాలంలో నిరంతరం సేవలందించనున్నాయి. వరదల సమాచారాన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగానికి అందిస్తూ అప్రమత్తం చేయనున్నాయి. హైదరాబాద్లోని జలసౌధలో సెంట్రల్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 19 నీటిపారుదల శాఖ సర్కిళ్ల పరిధిలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. రివర్ గేజ్లు ఏర్పాటు చేసుకొని.. జలాశయాలకు వచ్చే వరద పెరగ్గానే దిగువ స్థాయి ప్రాంతాలను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ప్రధాన ప్రాజెక్టులకు జూన్ నుంచే వరద రానుంది. ఐదేళ్ల పరిస్థితులను అంచనా వేసుకొని.. తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జలాశయాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, తమ పరిధిలోని చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లు, బ్యారేజీలను గమనిస్తూ.. నీటి నిల్వలపై సమాచారాన్ని కంట్రోల్ రూమ్లకు అందించాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించే ప్రసక్తేలేదని ఈఎన్సీ హెచ్చరించారు.