బూడిదను దాచి..దోచేస్తున్నారు!
ABN , First Publish Date - 2022-09-24T06:42:21+05:30 IST
బూడిదను దాచి..దోచేస్తున్నారు!
కృత్రిమ కొరతతో బట్టీ వ్యాపారుల విలవిల..డంపింగ్ కేంద్రాల్లో దాచుకుంటున్న నిర్వాహకులు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 23: ఎన్టీటీపీఎస్ బూడిద అక్ర మార్కులకు కాసులు కురిపిస్తోంది. బూడిద చెరువులో ఉండాల్సిన బూడిదను కొందరు ప్రైవేట్ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను డబ్బుకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఇటుక బట్టీల వ్యాపారులకు బూడిద కష్టాలు తప్పడం లేదు. ఇబ్రహీంపట్నంలో చుట్టు పక్కల పలు చోట్ల బూడిదను డంప్ చేస్తున్నారు. ఒకప్పుడు 10 టైర్ల టిప్పర్ రూ.2,300కు లభించేది. ఇప్పుడు రూ.5 వేలు దాటిపోయింది. కిరాయితో కలుపు కొని జి.కొండూరు, మైలవరం మండలాల్లో ఉన్న ఇటుక బట్టీల వద్దకు వచ్చే సరికి టిప్పర్ ధర రూ.8 వేలు దాటిపోతోంది. దీంతో ఇటుక వ్యాపారులు ఇటు కల ధరలను పెంచేస్తున్నారు. బ్రిక్స్ బిళ్లల తయారీదారులకు బూడిద కష్టాలు తప్పడం లేదు. బ్రిక్స్ బిళ్ల ధరను రూ.22 నుంచి రూ.24 వరకు విక్రయి స్తున్నారు. ఒక ఇటుక ప్రస్తుతం రూ.8 పలుకుతోంది. దీంతో జగనన్న పక్కా గృహాలు కట్టుకునే లబ్ధిదారులు ఇటుకలు కొనుగోలు చేసుకోలేక బ్రిక్స్ బిళ్లలు కొనుగోలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బూడిదను బ్లాక్ చేసుకొని ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సడక్ రోడ్డులో పొలాల మధ్యలో బూడిదను ఉంచడం వల్ల పంటలు పాడవు తున్నాయని రైతులు వాపోతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మిన్నకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇటుక, సిమెంట్ బ్రిక్స్ రాళ్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల్లో ఒకటైన బూడిదను తక్కువ ధరకు ఇప్పించాలని పలువురు కోరుతున్నారు.