తల దాచుకోబోయి మృత్యు ఒడికి
ABN , First Publish Date - 2022-05-27T06:42:39+05:30 IST
ఈదురు గాలులు ధాటిగా వీస్తుండడంతో తల దాచుకుందామని నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కన నిల్చున్న వ్యక్తిపై గోడ కూలటంతో అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఈదురుగాలులు వీస్తుండడంతో నిర్మాణంలో ఉన్న గోడ పక్కన నిల్చున్న వ్యక్తి
గోడ కూలి అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరికి గాయాలు
నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో విషాదం
తిరుమలగిరి(సాగర్), మే 26: ఈదురు గాలులు ధాటిగా వీస్తుండడంతో తల దాచుకుందామని నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కన నిల్చున్న వ్యక్తిపై గోడ కూలటంతో అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ పెదపంగ బాబు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడవిదేవులపల్లి మండలంలోని జాలకోటితండాకు చెందిన ముడావత్ పూల్సింగ్(43) తిరుమలగిరిలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న తన కుమారుడు సక్రియాను తీసుకువచ్చేందుకు స్వగ్రామం నుంచి మోటార్సైకిల్పై బయలుదేరాడు. ఈ క్రమంలో కొంపెల్లి వద్దకు రాగానే గ్రామానికి చెందిన మోహిన్పాషా ద్విచక్ర వాహనంపై వస్తానని కోరడంతో అతనిని ఎక్కించుకొని బయలుదేరాడు. తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రం సమీపంలోకి చేరుకోగానే పెద్దఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని నిర్మాణ దశ లో ఉన్న ఇంటి గోడ వద్ద తడవకుండా ఉండేందుకు నిల్చొన్నారు. అప్పటికే త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన దేవరకొండ ఆర్టీసీ డిపో ఉద్యోగి పానుగోతు శ్రీకాంత్ అదే ఇంటి గోడ పక్కన నిల్చొని ఉన్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలుల ధాటికి గోడ కూలడంతో సిమెంట్ ఇటుకలు మీద పడి పూల్సింగ్ అక్కడికక్క డే మృతిచెందాడు. శ్రీకాంత్ కాలుకు తీవ్ర గాయాలుకాగా, మోహిన్పాష స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మోహిన్పాషా 108కు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ పెదపంగ బాబు సంఘటనా స్థలానికి చేరుకో ని పూల్సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూల్సింగ్ సోదరుడు ముడావత్ ధన్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కుమారుడిని కలవకుండానే....
జాలకోటి తండాకు చెందిన పూల్సింగ్ తన పొలంలో మధ్యాహ్నం 12గంటల వరకు వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్నాడు. అనంత రం తిరుమలగిరికి వచ్చి అక్కడ పదో తరగతి పరీక్షలు రాస్తున్న దివ్యాంగుడైన తన కుమారుడు సక్రియాకు పింఛన్ డబ్బులు ఇప్పించేందుకు మొల్కచర్లలోని పోస్టాఫీసు వద్దకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వీరిని కలిసేందుకు తిరుమలగిరి మండల కేంద్రం సమీపంలోకి రాగానే భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో తలదాచుకోబోయి గోడ కూలిన సంఘటనలో పూల్సింగ్ మృతి చెందడంతో అతని కుటుంబంలో, తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.