బాబోయ్.. కూరగాయల ధరలు!
ABN , First Publish Date - 2020-09-16T09:11:37+05:30 IST
కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆకు కూరలు, మాంసాహారం ధరలదీ అదే దారి.
వందకు చేరువలో బీన్స్
ఠారెత్తిస్తున్న టమటా
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 15(ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆకు కూరలు, మాంసాహారం ధరలదీ అదే దారి. ప్రస్తుతం రూ.100 పెడితే రెండు మూడు రకాల కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి ఉంది. కొన్ని రకాలయితే రూ.20 వెచ్చించనిదే పావుకిలో రావడం లేదు. ఓ పది రోజుల క్రితం కిలో రూ.20 ఉన్న టమాట.. ఇప్పుడు రెట్టింపై రూ.40-50కి చేరింది. బీన్స్ ధర అమాంతం పెరిగిపోయింది. గత వారంలో కిలో రూ.65 ఉంటే.. ప్రస్తుతం రూ.100కు చేరువవుతోంది. చిక్కుడు కాయ, అలుగడ్డ, బజ్జీమిర్చి కూడా కిలోకు రూ.10 పెరిగాయి. ఆకు కూరల ధరలదీ అదే తీరు. రూ.10కి గతంలో మూడునాలుగు కట్టలు ఇచ్చే కొత్తిమీర, కరివేపాకు.. ప్రస్తుతం రెండుతో సరిపెడుతున్నారు.
డజన్ గుడ్లు రూ.54 నుంచి రూ.64కు చేరుకున్నాయి. చిల్లర దుకాణాల్లో అయితే ఆ ధర చూ.72గా ఉంది. కిలో రూ.160 ఉండే చికెన్.. ప్రస్తుతం రూ.220-240 మధ్య ఉంది. వారంలో ఏకంగా రూ.80 వరకూ పెరిగిపోయింది. రూ.100కు 6-8 కిలోలు విక్రయించిన వ్యాపారులు వాటిని నాలుగైదు కిలోలకు తగ్గించేశారు. అయితే.. రైతుబజార్లు, బహిరంగ కూరగాయల మార్కెట్లు, ఉల్లి మార్కెట్లకు మూడునాలుగు రోజులకు ఒకసారి సరుకు వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయిని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు కూడా ఒక కారణమని అంటున్నారు. కారణమేదైనా సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.