ఎఫ్ఎంసీజీ కంపెనీగా హెరిటేజ్
ABN , First Publish Date - 2021-08-04T08:08:34+05:30 IST
కేవలం డెయిరీ కంపెనీగా పరిమితం కాకుండా.. ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగే దిశగా హెరిటేజ్ ఫుడ్స్ అడుగులు వేస్తోంది.
మూడేళ్లలో విక్రయాల్లో 50 విలువ చేర్చిన ఉత్పత్తులు.. మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కేవలం డెయిరీ కంపెనీగా పరిమితం కాకుండా.. ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగే దిశగా హెరిటేజ్ ఫుడ్స్ అడుగులు వేస్తోంది. బేవరేజెస్, డ్రింకబుల్స్, బటర్ తదితరాలు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కిందకే వస్తాయని, తాజాగా దీర్ఘకాలం నిల్వ ఉండే ఉత్పత్తులపై కంపెనీ దృష్టి పెడుతోందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు. అత్యాధునిక రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్ఎంసీజీ తరహా పంపిణీ వ్యవస్థను కంపెనీ కలిగి ఉందన్నారు. కంపెనీ ఈ-కామ్ విక్రయాలు పెరుగుతున్నట్లు తెలిపారు. ఈ వ్యూహంలో భాగంగానే శ్రీదీ్పను కొత్త సీఈఓగా కంపెనీ నియమించుకుంది. మార్కెటింగ్ తదితర విభాగాల్లో శ్రీదీ్పనకు ఉన్న అనుభవం కంపెనీకి ఉపయోగపడుతుందని హెరిటేజ్ భావిస్తోంది.
ఏడాదికి ఆదాయంలో 20% వృద్ధి లక్ష్యం
ఆదాయంలో ఏడాదికి 20 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా మొత్తం ఆదాయంలో ప్రస్తుతం విలువ చేర్చిన ఉత్పత్తుల (వాల్యూ యాడెడ్) వాటాను ప్రస్తుతమున్న 29 శాతం నుంచి వచ్చే మూడేళ్లలో 45-50 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్రహ్మణి తెలిపారు. మొత్తం ఆదాయంలో విలువ చేర్చిన ఉత్పత్తుల వాటా 50 శాతానికి చేరాలంటే వీటి అమ్మకాలు ఏడాదికి 35 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా పాల విక్రయాలతో పోలిస్తే వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల విక్రయాలు ఆకర్షణీయంగా పెరుగుతున్నాయని.. అధిక వృద్ధి రేటు సాధించడం సాధ్యమేనని అన్నారు. వినియోగదారుల అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ విభాగంలో భవిష్యత్తులో కూడా పెరుగుదే సింహభాగం ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది.
ఆన్లైన్ మార్కెటింగ్పై దృష్టి
అమ్మకాలను పెంచుకోవడానికి ఆన్లైన్ మార్కెటింగ్, సోష ల్, డిజిటల్ మీడియాపై కంపెనీ దృష్టి పెట్టనుంది. కొన్నేళ్లుగా మొత్తం ఆదాయంలో 0.24-0.5 శాతం ఆదాయాన్ని ప్రకటనలపై కంపెనీ ఖర్చు చేస్తోంది. కాగా విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయాన్ని పెంచుకునే దిశగా గత ఏడాది కాలంలో వివిధ రకాల ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. వివిధ రకాల చీజ్లు, ప్రొబయాటిక్ పెరుగు, ఇమ్యునిటీ పాలు, కోల్డ్ కాఫీ, రెడీ-టు-ఈట్, రెడీ-టు-కుక్ విభాగంలో పన్నీర్ టిక్కాను విడుదల చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో మహారాష్ట్ర వంటి మార్కెట్లలో శ్రీకండ్, అమ్రాకండ్ వంటి వాటిని కూడా ప్రవేశపెట్టనుంది. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది.