Good News: రోజూ మందులు మింగుతూ ఇబ్బంది పడుతున్నారా.. ఈ మందుల్లేని వైద్యం ట్రై చేయండి..
ABN , First Publish Date - 2022-09-09T00:23:36+05:30 IST
మందులతో పనిలేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేసే వైద్య విధానం ఫిజియోథెరపీ. కొన్ని ప్రత్యేక వ్యాయామాలు, మర్దనలు, ఆధునిక వైద్య పరికరాలు ఉపయాగించి..
దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి చికిత్స
శారీరక రుగ్మతలెన్నో నయం
వైద్య విధానంలో వినూత్న మార్పులు
నేడు ప్రపంచ ఫిజియోథెరపీ డే
మందులతో పనిలేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేసే వైద్య విధానం ఫిజియోథెరపీ. కొన్ని ప్రత్యేక వ్యాయామాలు, మర్దనలు, ఆధునిక వైద్య పరికరాలు ఉపయాగించి చికిత్సలు అందించే ఈ విధానం మంచి ఫలితాలనిస్తోంది. 1813వ సంవత్సరంలో స్వీడన్కు చెందిన పర్హెన్రిక్స్ లింగ్ అనే వ్యక్తి క్రీడాకారులకు ఎదురయ్యే శారీరక సమస్యలు, నొప్పులకు కొన్ని రకాల వ్యాయామాలు, మర్దన పద్ధతులతో చికిత్స చేసేవారు. ఈ విధానం 1951లో భారతదేశంలో ప్రవేశించింది. తొలినాళ్లలో దీనికి పెద్దగా జనాదరణ దక్కకపోయినా గత పదేళ్లుగా ఫిజియోథెరపీకి ఆదరణ పెరుగుతోంది. దీంతో దేశంలో ఈ వైద్య విధానంపై జరిగిన పరిశోధనల ఫలితంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబరు 8వ తేదీని ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్స వంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తీర్మానించింది.
నేటి ఆధునిక వైద్యంలో ఫిజియోథెరపీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఆర్థో పెడిక్స్ (ఎముకలు), పీడీయాట్రిక్స్ (చిన్నపిల్లల వ్యాధులు), క్యాడో థెరాక్స్ (చెస్ట్) న్యూరాలజీ (నరాలు) స్పోర్ట్స్ (క్రీడలు) మస్కిటో స్కెల్టన్ (ఎముకల విభాగం) వంటివి ఫిజియోథెరపీలో ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందాయి. ఆర్థోపెడిక్, నరాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బాధితులు త్వరగా కోటుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పక్షవాతం, అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులను పైతం ఫిజియెథెరపీ దూరం చేస్తుంది. కీళ్ల సమస్యలు, కీళ్లు అరగటం, పక్షవాతం, పోలియో, కీళ్లవాపు వల్ల వచ్చే నొప్పులను తగ్గించటానికి, ఎముకలు విరిగాక వచ్చే వివిధ సమస్యల నివారణకు ఉపయోగ పడుతుంది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత తిరిగి పూర్వ స్థితికి రావటానికి ఫిజియోథెరపీ ఆసరాగా ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ ఫిజియోథెరపీ అవసరం ఎంతైనా ఉంది.
నడుం నొప్పి, భుజం నొప్పి, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, సెలబ్రల్ పాలసీ, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ఫిజియోథెరపీ నయం చేస్తుంది. ప్రస్తుతం ఫిజియోథెరపీలో ఎన్నో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్ పెరిఫిషియర్ పరికరం భుజం, మెడ నొప్పులను నివారిస్తుంది. మజిల్ స్టిమ్యులేటర్ పరికరంతో పక్షవాతం, మూతివంకర పోయిన వారికి ఉత్తేజాన్ని కలిగించి యథాస్ధితికి వచ్చేలా చేయటంలో ఉపయోగపడుతుంది. వెన్నుముక, భుజాలకు సంబంధించిన కండరాలను సడలించేందుకు ఎలక్ట్రికల్ ఇంటరాక్ట్ పరికరం దోహదం చేస్తుంది. తాజాగా రోబోటిక్ ఫిజియోథెరపీ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇలాంటిది చెన్నై అపోలో వంటి ఆసుపత్రులలోనే అందుబాటులో ఉంది.
వైద్య రంగంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం
వైద్య రంగంలో ఫిజియోథెరపీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అనే వ్యాధులు దీనివల్లే నయం అవుతున్నాయి. నయమవుతుంది. నేటి సమాజంలో శారీరక శ్రమలేక అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటి వారికి ఫిజియోథెరపీ ఆరోగ్యాన్నిస్తుంది. ఇందులో నూతన వైద్య విధానాలు కూడా వచ్చాయి.
- డాక్టర్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్, అపోలో ఆసుపత్రి
అంగవైకల్యాన్ని సైతం అరికట్టేలా....
చిన్న పిల్లల్లో వచ్చే అంగవైకల్యానికి చేసే చికిత్సలోనూ ఫిజియోథెరపీ కీలకంగా మారుతోంది. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి ఈ వైద్య విధానం తప్పనిసరి. ఆసుపత్రికి రాలేని ఎంతో మంది రోగులకు ఇంటి వద్దే చికిత్స అందించే సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రస్తుతం రోబోటిక్ ఫిజియోథెరపీ వైద్య విధానం కూడా చెన్నై వంటి నగరాల్లో అందుబాటులో ఉంది.
- డాక్టర్ తిరుపతి, నారాయణ ఆసుపత్రి ఫిజియోథెరపీ ప్రొఫెసర్