అటు మోదీ.. ఇటు కేసీఆర్!
ABN , First Publish Date - 2022-07-01T08:32:33+05:30 IST
జాతీయ రాజకీయాలతో భాగ్యనగరం వేడెక్కనుంది.
- 2న టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ భేటీలు
- జాతీయ రాజకీయాలతో హీటెక్కనున్న హైదరాబాద్
- పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న మోదీ
- అదే రోజున యశ్వంత్సిన్హాతో టీఆర్ఎస్ అధినేత భేటీ
- ఆ వేదిక పై నుంచే బీజేపీని విమర్శించనున్న కేసీఆర్
- ఆ గోడపై కాకి.. ఈ గోడపై వాలేది లేదంటున్న రేవంత్
- యశ్వంత్ను తమ పార్టీ నేతలు కలవబోరని స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాలతో భాగ్యనగరం వేడెక్కనుంది. ఒక వైపు బీజేపీ, మరో వైపు టీఆర్ఎస్ శనివారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించనుండడం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తున్నారు. మరుసటి రోజు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొననున్నారు. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ను జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా ఎంచుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలే స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కార్యవర్గ సమావేశాల్లోనూ ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే, సరిగ్గా ప్రధాని హైదరాబాద్కు వస్తున్న రోజునే.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ హైదరాబాద్కు ఆహ్వానించారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా జలవిహార్కు రానున్నారు. జలవిహార్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్న యశ్వంత్.. తనకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు.
ఇదే వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దీటుగా యశ్వంత్ సమావేశమూ హైలెట్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీనే లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో పావులు కదపాలని చూస్తున్న కేసీఆర్ తన ప్రత్యక్ష కార్యాచరణ ఈ సమావేశంతోనే ప్రారంభించనున్నారని చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలకు అప్పగించారంటేనే.. టీఆర్ఎస్ అధినేత ఎంత సీరియ్సగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. కాగా, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో యశ్వంత్సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించింది. టీఆర్ఎస్ ఇంటిపై వాలిన కాకి.. కాంగ్రెస్ ఇంటిపైన వాలే ప్రశ్నే లేదని, హైదరాబాద్కు వస్తున్న యశ్వంత్ సిన్హాను తాము కలవడం లేదని రేవంత్ స్పష్టం చేశారు.
నోవాటెల్లోనే ప్రధాని మోదీ బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లోనే బస చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.