ఇక్కడ... రూ. 28 వేలకే కరోనా వైద్యం...

ABN , First Publish Date - 2020-08-07T01:00:39+05:30 IST

కరోనా బాధితులకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్నందించే క్రమంలో... హైదరాబాద్ నగరంలో జైన్ ఇంటర్నేషనల్ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటయ్యింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కరోనా వైద్యం ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో తెలిసిన విషయమే. కొన్ని ప్రైవేలు ఆసుపత్రలు రోజుకు లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి.

ఇక్కడ... రూ. 28 వేలకే కరోనా వైద్యం...

హైదరాబాద్ : కరోనా బాధితులకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్నందించే క్రమంలో... హైదరాబాద్ నగరంలో జైన్ ఇంటర్నేషనల్ కోవిడ్ కేర్ సెంటర్‌ ఏర్పాటయ్యింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కరోనా వైద్యం ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో తెలిసిన విషయమే. కొన్ని ప్రైవేలు ఆసుపత్రులు రోజుకు లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. 


ఇక పీపీఈ కిట్లకు వేసిన బిల్లులను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బిల్లులు వసూలు చేస్తున్న రెండు ప్రైవేటు ఆసుపత్రులకు...  ప్రభుత్వం ఇప్పటికే షాకిచ్చిన విషయం తెలిసిందే. 


ఇక... ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ధైర్యం చేయడం లేదు. ప్రైవేటు ఆసుపత్రల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేక దిగువ మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో... వారానికి రూ. 28 వేలకే కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఓ ఆసుపత్రి సిద్ధమైంది. జైన్ ఇంటర్నేషనల్ సంస్థ వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దాతల సహకారంతో నడిచే ఈ సంస్థ... అతి తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించనుంది.


ఇప్పటికే దేశవ్యాప్తంగా పదిహేను కోవిడ్ కేర్ సెంటర్‌లను  ఏర్పాటు చేసిన జైన్ ఇంటర్నేషనల్ సంస్థ... మరో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. బేగంపేట చిరాగ్‌పోర్ట్‌లోని మూడంతస్తుల మానస సరోవర్‌ హోటల్‌లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు, ఆరోగ్య శాఖ సూచనలకణుగుణంగా ఇక్కడ వైద్యసేవలనందిస్తున్నారు. 


కరోనా నిర్ధారణ అయిన వారెవరైనా ఈ ఆసుపత్రిలో వైద్యాన్ని పొందవచ్చు. ఒక గదిలో ఇద్దరు చొప్పున ఉంటే వారానికి ఒక్కొక్కరికి రూ. 28 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గదిలో ఒక్కరు మాత్రమే ఉండాలంటే వారానికి రూ. 35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మందులు, ఆక్సిజన్ తదితర సదుపాయాలకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. రోగులకు పోషకాలతో కూడిన శాకాహారాన్నందిస్తారు.


షుగర్, హైబీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడే కోవిడ్ బాధితుల కోసం ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆరుగురు వైద్యుల బృందంతో పాటు వైద్య సిబ్బంది 24 గంటలపాటు విధినిర్వహణలో ఉండనుండడం విశేషం. 


కాగా ఈ కోవిడ్ సెంటర్‌లో ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది తప్ప వెంటిలేటర్లు ఉండవు. ఒకవేళ రోగికి వెంటిటేర్ అవసరమని భావిస్తే... మసాబ్ ట్యాంక్‌లోని మహవీర్ హాస్పిటల్‌లో తక్కువ ధరకే వెంటిలేటర్‌తో కూడిన వైద్యాన్నందించేలా ఏర్పాట్లు చేసారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించేందుకుగాను అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-08-07T01:00:39+05:30 IST