ఆర్థికంగా బలంగా ఉండడంతోనే...: హేమంత్ తల్లి

ABN , First Publish Date - 2020-09-25T18:34:45+05:30 IST

హేమంత్ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ఆర్థికంగా బలంగా ఉండడంతోనే...: హేమంత్ తల్లి

హైదరాబాద్: హేమంత్ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. తల్లిదండ్రుల ముందే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. హేమంత్ ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. హేమంత్‌ను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న సమయంలో డాడీ.. డాడీ అంటూ అరిచాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా హేమంత్ తల్లీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ పెళ్లి కులాంతర వివాహం కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతోనే అవంతిక కుటుంబసభ్యులు ఈ పెళ్లిని నిరాకరించారని, దారుణంగా హత్యకు పాల్పడ్డారని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.


ఇంటికి మొత్తం 10 మంది.. మూడు కార్లతో వచ్చారని హేమంత్ తల్లి తెలిపారు. హేమంత్ నుంచి దుండగులు ఫోన్ తీసుకునేలోపే తమకు లోకేషన్ పంపించాడని.. వెంటనే వెళ్లామని, తమ ముందునుంచే వాళ్ల కార్లు వెళ్లాయని, దాంతో హేమంత్ డాడీ.. డాడీ అంటూ పిలిచాడని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో కారులోంచి అవంతిక, హేమంత్ ఇద్దరూ కిందికి దూకారని, అయితే వెనుక నుంచి వస్తున్న మరో కారులో ఉన్నవారు హేమంత్‌ను పట్టుకుని.. తీసుకుపోయారని ఆమె తెలిపారు. ఒక ప్లాన్ ప్రకారం తమ కుమారుడిని హత్య చేశారని చెబుతూ ఆమె బోరున విలపించారు.

Updated Date - 2020-09-25T18:34:45+05:30 IST