నష్టపోయాం.. ఆదుకోండి!
ABN , First Publish Date - 2021-11-28T06:21:13+05:30 IST
తుఫాను తాకిడికి పంటలు దెబ్బతిని నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు జిల్లాకు విచ్చేసిన కేంద్రం బృందం సభ్యులకు విన్నవించారు.
కేంద్ర బృందానికి బాధిత రైతుల వినతి
రేణిగుంట, నవంబరు 27: తుఫాను తాకిడికి పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు విన్నవించారు. వరద నష్టంపై అంచనా నిమిత్తం కేంద్రం బృందం జిల్లాకు విచ్చేసిన విషయం విదితమే. ఆ మేరకు.. ఈ బృంద సభ్యులు శనివారం మధ్యాహ్నం మండలంలోని ఆర్.మల్లవరం, జీవగ్రామం తదితరప్రాంతాలను సందర్శించారు. ఆర్.మల్లవరంలో తుఫాను ధాటికి దెబ్బతిన్న రైతు చలపతికి చెందిన నాలుగెకరాల అరటితోట, ఇతర పంట పొలాలను పరిశీలించారు. వరద దెబ్బకు అధికంగా గుత్తివారిపల్లె రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో కలసి సర్పంచ్ మునివెంకట్రామిరెడ్డి వరదతో జరిగిన నష్టాన్ని కలెక్టర్ హరినారాయణన్ ద్వారా కమిటీకి నివేదించారు. మండలంలో 72.8 హెక్టార్లలో అరటితోటలు, 30 హెక్టార్లలో మామిడితోటలు, పూలతోటలు, కూరగాయల తోటలు, మిర్చి పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. అనంతరం నుంచి కేఎల్ఎం ఆస్పత్రి సమీపంలోని జీవగ్రామంలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. కాలువల ఆక్రమణతోనే ఇళ్లలోకి వరదనీరు చేరినట్లు స్థానికులు వాపోయారు. దీంతో కాలువల ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీఇచ్చారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు జీపాళెం-గాజులమండ్యం వద్ద స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న వంతెనను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. రోడ్డు భారీగా కుంగడంతో రాకపోకలు మళ్లించడంపై అధికారులతో ఆరా తీశారు. అక్కడి నుంచి పాపానాయుడుపేటలో వీరు పర్యటించి నష్టంపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు కునాల్ సత్యార్థి, శ్రీనివాసు బైరీ, శ్రావణ్కుమార్ సింగ్, ఉద్యాన శాఖాధికారి హెలెన్, రేణిగుంట తహశీల్దార్ శివప్రసాద్, డీటీ ప్రేమ్కుమార్, గాజులమండ్యం సర్పంచ్ జి.రమేష్, కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.