పరిమళిస్తున్న మానవత్వం.. అనాథలకు అండగా కదులుతున్న దాతలు
ABN , First Publish Date - 2020-09-21T15:21:43+05:30 IST
మానవత్వం పరిమళించింది. అనాథలైన ఆ బాలికలకు దాతృత్వం అండగా నిలుస్తోంది. మేమున్నాము.. ఆ దుకుంటాం.. సాయం చేస్తామంటూ పలువురు ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు పార్టీల కతీతంగా నేతలు, గ్రామస్థులు స్పందించారు.
పార్టీలకు అతీతంగా అందుతున్న సాయం
‘మన ఊరి వికాసం’ చొరవతో విరాళాలు
బాలికలకు వీలైనంత సాయం కోసం సోషల్ మీడియా ద్వారా యత్నాలు
కట్టావారిపాలెం/కొండపి(ప్రకాశం జిల్లా): మానవత్వం పరిమళించింది. అనాథలైన ఆ బాలికలకు దాతృత్వం అండగా నిలుస్తోంది. మేమున్నాము.. ఆ దుకుంటాం.. సాయం చేస్తామంటూ పలువురు ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు పార్టీల కతీతంగా నేతలు, గ్రామస్థులు స్పందించారు. వీలైనంత మేరకు సాయంతో పాటు విద్యాబుద్ధులు చెప్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా యత్నాలు ఆరంభించారు.
ఈనెల 12న అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చుండూరి సతీష్, ప్రసన్న దంపతుల కుమార్తెలు సాయి చందన (13), గీతిక(11) అనాథలైన విషయం పాఠకులకు విదితమే. వారిని ఆదుకునేందుకు గ్రామస్థులు, ‘మన ఊరి వికాసం’ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఎన్నారైలు స్పందించారు. ఇంకా గ్రామానికి చెందిన పలువురు పార్టీలకు అతీతంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేయగా, కొండపి గ్రామ పంచాయతీతోపాటు మండలంలోని పలు గ్రామాల యువకులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చిరుద్యోగులు స్పందిస్తున్నారు. అనాథలైన బాలికలకు భారీగా విరాళాలు ఇవ్వాలని సంకల్పించారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా దాతలు స్పందిస్తూ సాయం అందిస్తున్నారు.
తాకట్టు బంగారం విడిపించాలని..
మృతి చెందిన సతీష్ దంపతుల పేరున కొండపిలోని పలు బ్యాంకుల్లో బంగారం ఉండటంతో దాన్ని విడిపించి అనాథలైన బాలికలకు ఇచ్చేందుకు దాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సాయి చందన పదో తరగతి, గీతిక ఐదవ తరగతిలో చేరాల్సి ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మేనత్త సంరక్షణలో ఉన్నారు.
అటు తండ్రి తరుపున మేనత్త ఆర్థిక పరిస్థితి గాని, తల్లి తరుపున మేనమామల పరిస్థితిగాని బలహీనం కావడంతో గ్రామస్థులు విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చారు. 23వ తేదీ మరణించిన దంపతుల దశదిన కర్మ కార్యక్రమంలోగా కొంత మొత్తాన్ని సాయం అందించాలని విరాళాలు సేకరిస్తున్నవారు ఉన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కూడా తగిన పత్రాలు పూర్తి చేసి పంపామని గ్రామానికి చెందిన వలంటీర్లు తెలిపారు.
బాలికలకు అందరూ సాయ పడుతున్నారు: బొక్కిసం ఉపేంద్ర చౌదరి
అనాథలైన చిన్నారుల కోసం పార్టీలకు అతీతంగా అందరూ సా యం చేసేందుకు ముందుకు వస్తు న్నారు. గ్రామానికి చెందిన వారితో పాటు, పరిసర గ్రామాల వారు, అన్ని పార్టీలవారు, ఉద్యోగులు ఉన్నారు. వారిని ఆదుకునే సంకల్పంతో అందరం పనిచేస్తున్నాం. వీలైనంత వరకు వారి జీ వితానికి బరోసా ఇచ్చేలా విరాళాలు అందించాలన్నది అందరి సంకల్పం. చిన్నారులను ఉచితంగా చదివించేందుకు కూడా అవకాశాలు పరిశీలిస్తు న్నాం. అదేవిధంగా సాయం అందించేవారు ఫోన్పే ద్వారా 9959951497, ఫోన్ పే ద్వారా, గూగుల్ పేద్వారా 9542321290 నంబర్లకు తమ విరాళాలు అందించి సాయపడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.