నల్ల బుగ్గితో నరకం!

ABN , First Publish Date - 2021-05-17T04:45:43+05:30 IST

సెజ్‌లోని పలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

నల్ల బుగ్గితో నరకం!
సెజ్‌లోని ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం


  సెజ్‌లోని పలు పరిశ్రమల నుంచి వెలువడున్న వ్యర్థాలు

 ఇళ్లలో, చెట్లపైన, వ్యవసాయ క్షేత్రాల్లోని పశుల నీటి తొట్టిల్లో చేరిక

 ఆరోగ్యంపై పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన

 కాలుష్య నియంత్రణ మండలి స్పందించాలని వేడుకోలు

రాంబిల్లి, మే 16 : సెజ్‌లోని పలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాంబిల్లి,అప్పన్నపాలెం, లాలంకోడూరు, కృష్ణంపాలెం, రాజుకోడూరు, వెల్చూరు, వెంకటయ్యపాలెం, లోవపాలెం, సీతపాలెం తదితర గ్రామాలపై నల్లని ధూళి వచ్చి పడుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంబిల్లి మండలం పరిధిలోని ఎస్‌ఈజడ్‌లో సుమారు 20 వరకు కంపెనీలు ఉన్నాయి. వీటిలోని పలు పరిశ్రమల నుంచి వెలువడే నల్లని  పొడి ఇళ్లలో, చెట్లపై  పడుతోంది. అలాగే, ఉతికిన బట్టలు ఆరబెట్టినప్పుడు, భోజనానంతరం సామగ్రి కడిగి ఎండలో పెట్టినప్పుడు వాటిపై కూడా ఈ నల్లని బుగ్గి పడుతున్నట్టు మహిళలు చెపుతున్నారు. దీని వల్ల చర్మవ్యాధుల బారిన పడుతున్నట్టు కొందరు తెలిపారు. ఇళ్ల వద్ద నిల్వ ఉంచిన నీటిలో ఈ పౌడర్‌ తేలి ఉండడాన్ని చూస్తున్నవారు భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు.  పొలాల్లోని పశువుల పాకల వద్ద నీటి తొట్టెల్లో మరీ దారుణంగా ఈ ధూళి వచ్చి పడుతున్నట్టు రైతులు చెపుతున్నారు. దీనివల్ల పశువులు ఆనారోగ్యానికి గురై పాల దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితి మరింత అధికంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అంతా కోరుతున్నారు. 


Updated Date - 2021-05-17T04:45:43+05:30 IST