అంతిమయాత్రకు నరకయాతన

ABN , First Publish Date - 2021-07-22T07:07:57+05:30 IST

చౌటుప్పల్‌ పట్టణంలోని పురాతన శ్మశాన వాటిక ఊర చెరువు నీటిలో మునగడంతో దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.

అంతిమయాత్రకు నరకయాతన
చౌటుప్పల్‌లోని చెరువు నీటిలో మునిగిన శ్మశానవాటిక

చెరువు నీటిలో  మునిగిన శ్మశానవాటిక 

చౌటుప్పల్‌లో దహన సంస్కారాలకు ప్రజల ఇబ్బందులు

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 21: చౌటుప్పల్‌ పట్టణంలోని  పురాతన శ్మశాన వాటిక ఊర చెరువు నీటిలో మునగడంతో  దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.  10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు  వరద నీరు చెరవులోకి చేరడంతో  శ్మశానవాటిక నీటిలో మునిగింది. అక్టోబరు రెండవ వారంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి నెలల తరబడి అలుగు పారింది. నాలుగు నెలల క్రితం నీటి నుంచి శ్మశానవాటిక పాక్షికంగా  బయట పడింది. ఆ సమయంలోనూ శ్మశానవాటిక చుట్టూ  చెరువు  నీరు ఉండడంతో దహనసంస్కారాలు నిర్వహించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో  వర్షాలు కురుస్తు న్నందున  వరదనీరు శ్మశానవాటికను ముంచేసింది.  దహన సంస్కారాలు చేయలేని దుస్థితి ఏర్పడింది.   ఊర చెరువు ప్రాంతంలోని వారు మృతి చెందితే మరో ప్రాంతంలోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేసేం దుకు అక్కడి ప్రజలు అడ్డుచెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.కోటి  రూపాయలను కేటాయిందచినా శ్మశానవాటిక 10 నెలలుగా  చెరువు నీటిలోనే ఉండడంతో  ఒక్క అడుగు కూడా ముందుకుపడటంలేదని స్థానికులు తెలిపారు.

మరోచోట భూమిని కేటాయించాలి

చెరువులోని శ్మశానవాటికకు ప్రత్యామ్నయంగా మరో ప్రాంతంలో ప్రభుత్వం భూమి ని కేటాయించాలి. ఆ ప్రాంతంలోని శ్మశానవాటికను అభివృద్ధి చేయాలి.  ప్రస్తుతం దహన సంస్కారాలు చేసేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.  చెరువులోని శ్మశానవాటికతో భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు పడతాం.  ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్తగా శ్మశానవాటికను ఏర్పాటు చేయాలి.

దండ హిమబిందు, కౌన్సిలర్‌, చౌటుప్పల్‌ మునిసిపాలిటీ


Updated Date - 2021-07-22T07:07:57+05:30 IST