హెలికాప్టర్ శకలాల తరలింపు
ABN , First Publish Date - 2021-12-27T15:42:30+05:30 IST
నీలగిరి జిల్లా కున్నూర్ సమీపం నంజప్పసత్రం ప్రాంతంలో ఈనెల 8న సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురై త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ సహా 14 మంది మృత్యువాతపడిన నేపథ్యంలో ప్రమాదానికి
పెరంబూర్(చెన్నై): నీలగిరి జిల్లా కున్నూర్ సమీపం నంజప్పసత్రం ప్రాంతంలో ఈనెల 8న సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురై త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ సహా 14 మంది మృత్యువాతపడిన నేపథ్యంలో ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న వైమానిక, సైనిక దళాలు హెలికాప్టర్ శకలాలు తొలగించే పనులు ముమ్మరంగా చేపడుతున్నాయి. ప్రమాదస్థలి నుంచి శకలాలు బయటకు తీసుకొచ్చేందుకు దారి లేకపోవడంతో, శకలాలను విడగొట్టి చిన్న భాగాలు చేసి తరలిస్తున్నారు. కానీ, హెలికాప్టర్ ఇంజన్, మధ్య భాగం సుమారు ఒకటిన్నర టన్ను బరువు ఉండంతో తరలించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో, తేయాకు తోట మీదుగా దారి ఏర్పాటుచేసి హెలికాప్టర్ భాగాలను వెలుపలికి తీసుకొచ్చి మూడు లారీల ద్వారా సూలూరు వైమానిక దళ కేంద్రానికి తరలించే పనులను సైనికులు ముమ్మరంగా చేపట్టారు. తరలింపు పనులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలోని సైనిక భద్రతను విడతలవారీగా ఉపసంహరించనున్నట్టు అధికారులు తెలిపారు.