భారీ వర్షానికి కూలిన పాత భవనం
ABN , First Publish Date - 2022-05-05T15:33:56+05:30 IST
సేలం పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీవర్షం కారణంగా పాత భవనంలోని బాల్కనీ కూలిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో
- ముగ్గురికి గాయాలు
ప్యారీస్(చెన్నై): సేలం పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీవర్షం కారణంగా పాత భవనంలోని బాల్కనీ కూలిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో గరిష్ఠంగా సేలం పట్టణంలో 37.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాల వల్ల సేలంలోని ప్రధాన వీధుల్లో వర్షపునీరు చేరడంతో వాహనచోదకులు పడరాని పాట్లుపడ్డారు. కాగా, సేలం సెవ్వాపేట ప్రాంతంలో ఉన్న శ్రీధర్కు సొంతమైన పాత ఇంటి ముందు భాగంలో ఉన్న బాల్కనీ హఠాత్తుగా విరిగిపడింది. ఆ సమయంలో వర్షం కురుస్తుండడంతో భవనం కింద తలదాచుకున్న సెక్యూరిటీ గార్డ్ సుబ్రమణ్యం, ఆయన స్నేహితుడు విశ్వనాథన్, అదే ప్రాంతానికి చెందిన హరిహరన్ శిథిలాల్లో చిక్కుకొని స్వల్పంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు వారిని శిథిలాల నుంచి వెలుపలికి తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సేలం తహసీల్దార్ విష్ణువర్ధిని ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై అన్నదానంపట్టి పోలీసులు కేసు నమోదుచేశారు.