అర్ధరాత్రి అంధకారం

ABN , First Publish Date - 2022-05-26T06:35:27+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, భారీ వర్షానికి అపారనష్టం సంభవించింది. అరటి తోటలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.

అర్ధరాత్రి అంధకారం
భీమవరంలో గంగానమ్మ గుడి వద్ద విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

అకాల వర్షం.. గాలులకు విరిగిన స్తంభాలు

తెగిన వైర్లు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు

విద్యుత్‌ సరఫరా నిలిపివేత..  రూ.20 లక్షల నష్టం

తడిచిన ధాన్యం, నేలకూలిన అరటి చెట్లు

రైతులకు మిగిలిన కడగండ్లు


భీమవరం టౌన్‌/తణుకు, మే 25 :  పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, భారీ వర్షానికి అపారనష్టం సంభవించింది.  అరటి తోటలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.  ధాన్యం రాశులు, బస్తాలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి పట్టణాలు, పల్లెలు అంధకారంలో ఉన్నాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం డివిజన్లలో మొత్తం 87 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోగా, 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఏడు కిలోమీటర్ల వైరు తెగిపోయింది. బుధవారం రాత్రికి వీటికి మరమ్మతులు పూర్తి చేస్తామని విద్యుత్‌ శాఖ ఈఈ, జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ పీర్‌ ఖాన్‌ తెలిపారు. సుమారు రూ.20 లక్షలు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కారణంగా భీమవరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా మున్సిపల్‌ అధికారులు జనరేటర్‌ ద్వారా నీటిని పంపింగ్‌ చేశారు. 

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు జిల్లాలో సరాసరి 71.21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నరసాపురంలో 80.2 ఎం.ఎం, మోగల్లు 64.2, పాలకొల్లు 120.4, యలమంచిలి 52.6, పోడూరు 116, ఆచంట 73 పెనుగొండ 60.4, పెనుమంట్ర 96.6, ఇరగవరం 75.2, తణుకు74.8, అత్తిలి 123.8, పెంటపాడు 56.4, తాడేపల్లిగూడెం 89.4, ఆకివీడు 20.8, పాలకోడేరు 64.6, వీరవాసరం 90.2, భీమవరం 54.4, ఉండి 25.4, కాళ్ల 14.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

తెగిన విద్యుత్‌ వైర్లు తగిలి.. 

నరసాపురం రూరల్‌, మే 25 : మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా రోడ్డుపై తెగి పడివున్న విద్యుత్‌ వైర్లు మెడకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. నరసాపురం ఎస్‌ఐ ప్రియకుమార్‌ తెలిపిన వివరాలివి.. సరిపల్లి ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షం, ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభం, వైర్లు కింద పడిపోయాయి. ఆ సమయంలో మల్లవరం లంకకు చెందిన వేడంగి సైమన్‌(45), పి.సంజీవరావు నరసాపురం నుంచి ఇంటికి బైక్‌పై వెళుతుండగా ఈ విద్యుత్‌ వైర్లు మెడకు తగిలి కింద పడిపోయారు. సైమన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సంజీవరావు ప్రాణాలతో బయటపడ్డారు. సైమన్‌ తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 






Updated Date - 2022-05-26T06:35:27+05:30 IST