వర్షం..రైతుల్లో హర్షం
ABN , First Publish Date - 2020-08-10T10:27:10+05:30 IST
జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గంట పాటు వర్షం పడింది.
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/కొమరాడ : జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గంట పాటు వర్షం పడింది. దీంతో నగరంలోని లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు వేయగా...మధ్యాహ్నం 2.30 గంటల తరువాత మేఘాలు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. ఏకధాటిగా గంట పాటు వర్షం కురవడంతో నగరం తడిసి ముద్దయ్యింది. వర్షం పడుతున్నంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొమరాడ, కురుపాం మండలాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది.
ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నచోట్ల ఉబాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కాలువల పరిధిలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షం ఉపశమనమిచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ముంగిట వర్షాలు పడకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి రైతులు వరి ఆకుమడులు వేసుకున్నారు. కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇటీవల చెదురుమదురు వర్షాలు పడడంతో ఉబాలు ప్రారంభించారు. వారం రోజులుగా వర్షం పడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఆదివారం కురిసిన వర్షం ఉబాలుకు జీవం పోసినట్టయ్యిందని రైతులు చెబుతున్నారు.