పలుచోట్ల భారీ వర్షం
ABN , First Publish Date - 2022-05-18T03:51:30+05:30 IST
పలుచోట్ల భారీ వర్షం
- పిడుగుపాటుకు రైతు, ఎద్దు మృతి
తాండూరు రూరల్, మే 17: వికారాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. తాండూరు మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి, ఎద్దు మృతిచెందాయి. రాంపూర్ కింది తండాలో మూడవత్ రవి(37) అనే రైతు మాల నర్సమ్మ పొలాన్ని కౌలుకు తీసుకొని వానకాలం సన్నద్ధతలో భాగం గా గుంటుకతో కొడుతుండగా వానొచ్చిం ది. తడవకుండా ఉండేందుకని రైతు రవి చెట్టుకింది నిల్చున్నాడు. అప్పుడే పిడుగు పడి రవి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి పక్కనే ఉన్న ఎద్దు సైతం మృత్యువాత పడింది. రవి, ఎద్దు మృతిపై తండా వాసులు కరన్కోట్ పోలీసులకు సమాచారమిచ్చారు. రవి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు.
- పరిగిలో ప్రాంతంలో నేలవాలిన చేలు
పరిగి: పరిగి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. వర్షానికి వరి పంట పాడైంది. చేతికొచ్చే దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలు వా న, గాలులకు నేలవాలాయి. అలాగే వరి చేలలో వడ్లు, మామిడి తోటల్లో మామిడికాయలు రాలాయి. పరిగిలో కురిసిన వర్షానికి బాహర్పేట్ చౌరస్తా, తిరుమల వెంచర్లో నీరు నిలిచింది.
- తాండూరులో రోడ్లపై వరద
తాండూరు: తాండూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు ప్రవహించింది. వర్షంతో వాతావరణం చల్లబడింది.