అకాల భారీ వర్షం

ABN , First Publish Date - 2021-05-12T07:23:51+05:30 IST

జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. కాకినాడ రాజమహేంద్రవరం నగరాలు, ఏజెన్సీతో పాటు పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు అకాల వర్షాలతో రైతులు కుదేలవుతున్నారు.

అకాల భారీ వర్షం
కాకినాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • నీట మునిగిన రహదారులు
  • తడిసి ముద్దయిన ధాన్యపు రాశులు
  • పంటను కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు

భానుగుడి (కాకినాడ)/సామర్లకోట, మే 11: జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. కాకినాడ రాజమహేంద్రవరం నగరాలు, ఏజెన్సీతో పాటు పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు అకాల వర్షాలతో రైతులు కుదేలవుతున్నారు. కళ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవుతుంటే కాపాడు కోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఇక పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తరలించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. లారీల కొరత వేధిస్తోంది. తీరా మార్కెట్‌కు తీసుకెళ్తే పది రోజుల వరకు అమ్ముకునే పరిస్థితి లేదు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు సంభవించి మేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున ఉరుములు ఉరిమాయి. ఈదురు గాలులకు తోడు వర్షం పడడంతో రైతులు సతమత మయ్యారు. రబీ వరి సాగులో ధాన్యం రాశులను కళ్లాలలోను, రోడ్డు వెంబడి ఆరబోసే పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు కలవరం చెందారు. ఉరుకులు, పరుగులు పెట్టి ధాన్యాన్ని రాశులుగా పేర్చి వాటిపై బరకాలు కప్పేందుకు ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. మాసూళ్లు పూర్తయ్యి సుమారు 15 రోజులు గడిచినా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయట్లేదు. దీంతో తరచూ తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు.

Updated Date - 2021-05-12T07:23:51+05:30 IST